బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 మే 2020 (08:58 IST)

శునకాన్ని హింసించిన ముంబై కిరాతకుల అరెస్టు...

టిక్ టాక్ వీడియో కోసం ఓ శునకాన్ని హింసించి, చంపేని ఇద్దరు యువకులను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ ఇద్దరు యువకుల ఆచూకీ తెలిపితే రూ.50 వేల నజరానా ఇస్తామని జంతు పరిరక్షణ సంస్థ పెటా ఓ ట్వీట్ చేసింది. పైగా, ఈ యువకుడు పోస్ట్ చేసిన వీడియో సైతం వైరల్ కావడంతో ఆ కిరాతకులను కఠింగా శిక్షించాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు యువకులను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిలో అరెస్టు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇద్దరు యువకులు ఓ శునకం కాళ్లను తాడుతో కట్టి దానిని ఇద్దరూ పట్టుకుని పెద్ద మురికిగుంటలోకి విసిరేస్తూ వీడియో తీశారు. అంతేకాదు, అది బయటకు తేలకుండా ఒడ్డు నుంచి పెద్ద రాళ్లతో దానిని కొట్టి చంపేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో దుమారం రేగింది.
 
శునకాన్ని హింసించి చంపిన వారిని పట్టుకుని శిక్షించాలంటూ నెట్టింట డిమాండ్లు వెల్లువెత్తాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు సునీల్ శెట్టి, హీనా సిద్ధు వంటి వారు కూడా ఈ వీడియోపై స్పందించారు. ఈ వీడియోను చూసిన 'పెటా' తీవ్రంగా స్పందించింది. శునకాన్ని హింసించిన వారిని పట్టుకుని అప్పగిస్తే రూ.50 వేలు ఇస్తామని ప్రకటించింది.
 
అదేసమయంలో పోలీసులు కూడా వేట సాగించారు. చివరికి ఉజ్జయినిలో వీరు పోలీసులకు చిక్కారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఇద్దరు నిందితులు ముంబైకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకడు సన్నీ బొరాస (19) కాగా, మరొకడు బాలుడు. వీరిని పట్టుకున్న వాళ్లకు 'పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్' (పెటా) రూ.50 వేల రివార్డును కూడా ప్రకటించింది.