1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (14:54 IST)

ఉబెర్ బోట్లు... ముంబైలో... ప్రయాణ చార్జి ఎంతంటే..?

ఉబెర్... దాదాపు నగరవాసులందరికీ తెలిసిన పదమే. క్యాబ్ సర్వీస్‌లతో మొదలుపెట్టి... ఉబెర్ ఈట్స్ అంటూ ఒక కొత్త సదుపాయాన్ని అందజేసిన ఈ సంస్థ మరో ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా ఉబెర్ బోట్ సర్వీసులను ప్రారంభించింది. ప్రస్తుతానికి ముంబైలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సదుపాయం క్రింద ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా, ఎలిఫెంటా ఐల్యాండ్స్, మండ్వా జెట్టీల మధ్య స్పీడ్‌బోట్లు అందుబాటులోకి రానున్నాయి. 
 
ఉబెర్‌ బోట్ పేరుతో ప్రారంభించిన ఈ సేవలు ఇప్పటికే ఉపయోగిస్తున్న ఉబర్ మొబైల్ అప్లికేషన్ నుంచి అందుబాటులో ఉంటాయి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రేపటి నుంచి ‘ఉబెర్ బోట్’, ‘ఉబెర్ బోట్ ఎక్స్ఎల్’ సేవలు ప్రారంభం కానున్నాయి. ఉబెర్‌బోట్‌‌లో ఆరు నుండి ఎనిమిది మంది ప్రయాణికుల వరకు ప్రయాణించే సదుపాయం ఉండగా, ఉబెర్‌ఎక్స్‌ఎల్‌లో పది మందికి పైగా ప్రయాణించే సదుపాయం ఉంటుంది. క్యాబ్‌ల మాదిరిగానే వీటిని కూడా కొన్ని నిమిషాలకు ముందుగానే ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చు.
 
అయితే, ప్రస్తుతానికి ఒక్కో సీట్ బుక్ చేసుకునే అవకాశం లేదు. ఈ సేవను పొందాలంటే మొత్తం బోట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉబెర్‌బోట్ ప్రయాణ ధర రూ.5,700గా ఉండగా, ఉబెర్ ఎక్స్ఎల్ ధర రూ.9,500గా నిర్ణయించారు. గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంట్ ఐల్యాండ్స్‌కి సాధారణ పడవ ప్రయాణం 45 నిమిషాలు. అయితే స్పీడ్‌బోట్లు 25 నిమిషాల్లో తీసుకెళ్లగలుగుతాయి. ఈ మూడు రూట్లలో 15 స్పీడ్ బోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల భద్రత కోసం మహారాష్ట్ర మెరీటైమ్ బోర్డు అత్యవసర హెల్ప్‌లైన్‌ని కూడా అందబాటులోకి తెచ్చింది.