1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 డిశెంబరు 2020 (13:42 IST)

రైతన్నలకు వేడి వేడి జర్దా పులావ్ వడ్డించిన ముస్లిం సోదరులు..

దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నెల రోజులకు పైగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ చల్లటి చలిని సైతం లెక్కచేయకుండా నిరసనల్ని కొనసాగిస్తున్న రైతుల కోసం ముస్లిం సోదరులు రుచికరమైన 'జర్దా పులావ్'ను వండి వడ్డించారు. చల్లటి చలిగాలుల్లో వేడి వేడి ఘుమఘుమలాడే పులావ్‌ను వండి వడ్డించారు. 
 
కాగా.. కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలిచినా ఏమాత్రం ఫలించటంలేదు. అయినా సరే తమ డిమాండ్స్ నెరవేరేవరకూ నిరసనలు ఆపేది లేదంటూ గడ్డకట్టే చలిని కూడా లెక్క చేయకుండా రైతులు శాంతియుతంగా నిరసనలు తెలుపుతూనే వున్నారు. వీరి ఆందోళనలకు పలు సంస్థల నుంచి మద్దతు లభిస్తోంది. విదేశాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఎంతోమంది రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. 
 
ఈ క్రమంలో రైతన్నలకు మద్దతు తెలిపేందుకు పంజాబ్‌లోని మలేర్ కోట్లా ప్రాంతం నుంచి కొంతమంది ముస్లింలు ఢిల్లీ సరిహద్దులోని సింఘు ప్రాంతానికి వచ్చారు. వారికి రైతులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మలేర్ కోట్లాకు చెందిన హాజీ మహ్మద్ జమీల్ అనే ముస్లిం సోదరుడు మాట్లాడుతూ..గత నవంబరు 26 నుంచే తాము రైతులకు పలు రకాల ఆహారాలు అందిస్తున్నామని తెలిపారు.
 
జర్దా పులావ్ ప్రధానంగా శాకాహార వంటకం అని, తీపి, ఉప్పుల సమ్మిళితంగా దీని రుచి ఉంటుందని తెలిపారు. రైతులు దేశానికి అన్నదాతలు.. వారు ఆకలితో ఉంటే దేశానికి ఏమాత్రం మంచిది కాదు.. ఏ ఉద్యోగం చేసేవారైరనా.. ఎంత కోటీశ్వరుడైనా రైతులు పండించే ఆహారాన్ని తినాలని అటువంటి రైతులు నడిరోడ్లపై తమ ఆందోళనలకు చేస్తుంటే ప్రభుత్వానికి ఏమాత్రం పట్టటం లేదని అన్నారు. ఇలాంటి సమయాల్లో అందరి కడుపులు నింపే రైతన్నల కడుపులు నింపడం తమ ధర్మం అని తెలిపారు.