శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 19 నవంబరు 2020 (19:59 IST)

నా కుక్క చనిపోయింది, నేనూ చనిపోతున్నానంటూ యువతి ఆత్మహత్య

తన పెంపుడు కుక్క చనిపోయిందని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలను తీసుకున్న విషాద ఘటన ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రం రాయ్‌గ‌ఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. రాయ్‌గ‌ఢ్ జిల్లా గోర్ఖా ప్రాంతంలోని కొట్రా రోడ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ఓ కాల‌నీలో 21 ఏళ్ల ప్రియాన్షుసింగ్ పీజీ చదువుతోంది. తనకు తన పెంపుడు కుక్క అంటే ఎంతో ఇష్టం. గత నాలుగేళ్లుగా ఈ కుక్కను ఆమె పెంచుతోంది. ఐతే కుక్కకు అనారోగ్యం కలుగడంతో అది చనిపోయింది.
 
ఆ కుక్క చనిపోగానే ప్రియాన్షు తీవ్ర మనస్తాపానికి గురై ఆవేదన చెందుతూ వుంది. కుక్క బుధవారం నాడు మృతి చెందగా అదే రాత్రి ఆ యువతి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన మృతదేహాన్ని దహనం చేయవద్దనీ, కుక్కను ఎక్కడ ఖననం చేసారో అక్కడే తనను కూడా ఖననం చేయాలని సూసైడ్ నోట్ రాసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.