గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 25 జూన్ 2021 (17:51 IST)

Narendra Modi: ఆ చీకటి రోజులను ఎన్నటికీ మరచిపోలేం

దిల్లీ: ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం మోపిన ఆత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ) రోజులను ఎప్పటికీ మరచిపోలేమంటూ శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య విలువలను అణచి వేసిందని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
‘ఆ ఆత్యయిక స్థితినాటి చీకటి రోజులను ఎప్పటికీ మరచిపోలేం. 1975 నుంచి 1977 మధ్య రాజ్యాంగ సంస్థలు క్రమంగా విచ్ఛిన్నం కావడం మనకు కనిపిస్తుంది. భారతదేశ ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తూ, రాజ్యాంగంలో పొందుపరచిన విలువలకు అనుగుణంగా జీవిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం. మన ప్రజాస్వామ్య నీతిని కాంగ్రెస్ అణచివేసింది.

ఆ చీకటి రోజులకు వ్యతిరేకంగా ప్రతిఘటించి, భారత ప్రజాస్వామ్య రక్షణకు పాటుపడినవారంతా చిరస్మరణీయులు’ అంటూ మోదీ వరుస ట్వీట్లు చేశారు. అలాగే ‘డార్క్‌డేస్‌ ఆఫ్ ఎమర్జెన్సీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను షేర్ చేశారు. అంతేకాకుండా బీజేపీ ఫర్ ఇండియా ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన పోస్టును జోడించారు.
 
మర్జెన్సీ కాలంలో ఏమేమి నిషేధానికి గురయ్యాయో చిత్రరూపంలో వివరిస్తూ.. భాజపా ఆ పరిస్థితులను నిరసించింది. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఆత్యయిక పరిస్థితిని విధించారు. అది సుమారు 21 నెలలపాటు కొనసాగింది.