1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (15:08 IST)

హోటల్ బిల్లు చెల్లించకుండా బాత్రూమ్ కిటికీలోనుంచి పారిపోయిన కస్టమర్!

మ‌హారాష్ట్ర‌లోని న‌వీముంబైలో ఓ విచిత్ర కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. గత 8 నెలలుగా హోట‌ల్‌ గదిలో మకాం వేసిన ఓ కస్టమర్ రూ.25 లక్షల బిల్లు చెల్లించకుండా హోటల్ బాత్రూమ్ కిటికీలో నుంచి తప్పించుకుని పారిపోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం వివరాలను పరిశీలిస్తే, ముర‌ళి కామ‌త్ (43) అనే వ్యక్తి ఖ‌ర్గార్ ప్రాంతంలోని హోట‌ల్ త్రీస్టార్‌లో రెండు రూములు తీసుకుని త‌న 12 ఏంళ్ళ కుమారుడితో క‌లిసి ఎనిమిది నెలుగా ఉంటున్నాడు. 
 
గ‌త ఏడాది న‌వంబ‌ర్ 23న తొలుత కామ‌త్ హోట‌ల్‌క వ‌చ్చాడు. తాను సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేస్తానని హోట‌ల్ సిబ్బందికి చెప్పిన ఆయ‌న హోట‌ల్‌లో రెండు సూప‌ర్ డీల‌క్స్ రూమ్‌లు బుక్ చేశాడు. 
 
ఓ రూంలో తాను ఉంటాన‌ని, మ‌రో రూంలో త‌న ప‌నికి సంబంధించిన స‌మావేశాలు జ‌రుగుతాయ‌ని చెప్పాడు. నెల రోజుల త‌ర్వాత డిపాజిట్ చెల్లిస్తాన‌ని, అందుకు త‌న పాస్‌పోర్ట్‌ను హామీగా పెడ‌తాన‌ని చెప్పాడు.
 
ఈ ఏడాది మే వ‌ర‌కూ కామ‌త్ ఎలాంటి చెల్లింపులు చేయ‌లేదు. మొత్తం బిల్లు రూ.25 లక్షలకు చేరుకుంది. ఈ క్రమలో జులై 17న కామ‌త్‌, త‌న కొడుకుతో పాటు బాత్రూం కిటికీ గుండా పారిపోయినట్టు హోటల్ సిబ్బంది గుర్తించారు. కామ‌త్ త‌న ల్యాప్‌టాప్‌, మొబైల్ పోన్‌ను రూంలోనే వ‌దిలివేసి వెళ్లాడు. హోటల్ నిర్వాహకులు ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.