1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 25 జులై 2023 (17:51 IST)

కొత్త తరహా మోసం గురూ... మహిళలను గర్భవతులు చేస్తే రూ.25 లక్షలు

తమ సంతాన సాఫల్య కేంద్రానికి సంతానం కోసం వచ్చే మహిళలతో శారీరకంగా కలిసి వారిని గర్భవతిని చేస్తే రూ.25 లక్షల నగదు ఇస్తామంటూ ఓ ముఠా నేపాల్ వాసి నుంచి రూ.50 వేలను స్వాహా చేసింది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. పుదుచ్చేరిలోని మహేలో శ్రీజిత్ (44) అనే వ్యక్తి స్థానికంగా ఒక గెస్ట్ హౌస్ నడుపుతున్నాడు. ఇక్కడ నేపాల్‌కు చెందిన షాజన్ భట్టారాయ్ (34) ఉంటూ అన్ని రకాల పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో షాజన్‌కు మొబైల్‌కు గుర్తు తెలియని నంబరు నుంచి ఫోన్ చేసి... తనవద్ద ఒక బెస్ట్ ఆఫర్ ఉందని, తమ కేంద్రానికి వచ్చే మహిళలను గర్భవతులను చేస్తే రూ.25 లక్షలు ఇస్తామంటూ నమ్మించాడు. 
 
ఇందుకోసం ముందుగా రూ.2 లక్షల అడ్వాన్స్ ఇస్తామని, అయితే, ఆధార్, బ్యాంకు ఖాతా నంబరు, గుర్తింపు కార్డు ఇవ్వాలంటూ కోరాడు. ఆ మోసగాడి మాటలు గుడ్డిగా నమ్మిన షాజన్.. అడిగినవన్నీ పంపించాడు. కొంతసేపటి తర్వాత ఒక మహిళతో శారీరకంగా కలిసి ఉండేందుకు ముందుగానే రూ.5 లక్షలు, రూ.49 వేలు చొప్పున షాజన్ బ్యాంకు ఖాతాకు డబ్బులు డిపాజిట్ చేసినట్టుగా రిసిప్టులను మొబైల్ వాట్సాప్ నంబరుకు పంపించాడు. 
 
అయితే, ఈ డబ్బును పూర్తిగా పొందాలంటే దరఖాస్తు ఫాంను పూర్తి చేసి, దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నాడు. దీంతో షాజన్ తన బ్యాంకు ఖాతాలో వారు పంపిన నగదు డిపాజిట్ అయిందా లేదా అనే విషయాన్ని తనిఖీ చేయకుండానే ఆ వ్యక్తి పంపిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగా, బ్యాంకు ఖాతాలోని రూ.50 వేలను మోసగాళ్ళు తమ బ్యాంకు ఖాతాల్లోకి మార్చుకున్నాడు. ఆ తర్వాత షాజన్ తన బ్యాంకు ఖాతాను తనిఖీ చేయగా, అందులో డబ్బులు డిపాజిట్ కాలేదు కదా, ఆ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.50 వేలు మాయమైనట్టు గుర్తించి, లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.