గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2019 (13:42 IST)

ప్రభుత్వ ఏర్పాటుకు మాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయ్ : శివసేన

మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 21వ తేదీన వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ - శివసేన కూటమి విజయభేరీ మోగించింది. కానీ, ప్రభుత్వ ఏర్పాటుపై మాత్రం ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీనికి ప్రధాన కారణంగా.. అధికారాన్ని పంచుకోవాలన్న డిమాండ్‌ను శివసేన తెరపైకి తీసుకుని రావడమే. ఈ డిమాండ్ బీజేపీ అగ్రనేతలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. 
 
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటు ఎందుకు ఆలస్యమవుతుందన్న ప్రశ్నకు శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. 'మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో శివసేనకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయని, కానీ, ఇతర ప్రత్యామ్నాయాలను చూసుకొనే తప్పుడు పనుల్ని చేయబోమని మా పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. శివసేన ఎల్లప్పుడూ సత్యంతో కూడిన రాజకీయాలనే చేస్తుంది. మాకు అధికార దాహం లేదు' అని వెల్లడించారు.
 
అంతేకాకుండా, 'మహారాష్ట్రలో దుష్యంత్ (హర్యానా నేత) వంటి వ్యక్తులు లేరు. అక్కడ ఆయన తండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ ధర్మం, సత్యం ఆధారంగా రాజకీయాలు చేస్తాం. ఎన్సీపీ అధినేత శదర్ పవార్ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా వాతావరణాన్ని సృష్టించారు. ఆయన బీజేపీతో ఎన్నడూ కలవబోరు' అని వ్యాఖ్యానించారు.