శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (17:51 IST)

ఒమిక్రాన్ ఎఫెక్ట్ : గుజరాత్‌లో రాత్రిపూట కర్ఫ్యూ

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ దెబ్బకు పలు దేశాలు క్రమంగా లాక్డౌన్‌లోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికే యూరప్ వంటి దేశాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలోని పలు రాష్ట్రాలు కూడా ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా, పలు కఠిన చర్యలను అమలు చేస్తున్నాయి. ఇందులోభాగంగా, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లో రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు ప్రకటించారు. 
 
దేశ వ్యాప్తంగా 153 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదుకాగా, గుజరాత్ రాష్ట్రంలో ఈ కేసుల సంఖ్య 11గా ఉంది. రాబోయే రోజుల్లో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన పట్టణాల్లో నైట్ కర్ఫ్యూను విధించింది. 
 
ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులు సోమవారం రాష్ట్రంలో ఒమిక్రాన్, కరోనా పరిస్థితులపై ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్, సహా ఎనిమిది నగరాల్లో నైట్ కర్ఫ్యూను ఈ నెల 31వ తేదీ వరకు విధించింది. ఈ రోజుల్లో రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోం శాఖ సోమవారం ఆదేశాలు జారీచేసింది. 
 
పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
ప్రపంచాన్ని గడగడాలిడిస్తున్న ఒమిక్రాన్ వైరస్ ఇపుడు చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఫలితంగా దేశంలో మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 153కు చేరుకుంది. ఆదివారం మహారాష్ట్రలో ఆరు కేసులు, గుజరాత్‌లో నాలుగు చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. వీటన్నింటితో కలుకుని ఈ కేసు సంఖ్య 153కు చేరింది. 
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల మేరకు 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోకి ఈ వైరస్ ప్రవేశించింది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 54 కేసులు, ఢిల్లీలో 22, రాజస్థాన్‌లో 14, తెలంగాణాలో 20, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో 11 చొప్పున, ఏపీ, చండీగఢ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. 
 
మరోవైపు, ఈ కొత్త వేరియంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. గతంలో బయటపడిన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ఎంతో వేగంగా వ్యాపిస్తుందని తెలిపింది. ఇప్పటికే 90కు పైగా దేశాల్లో ఈ వైరస్ వ్యాపించిన విషయం తెల్సిందే. 
 
మాస్కులు ధరించండి - బూస్టర్ వేయించుకోండి.. 
ప్రపంచాన్ని ఒమిక్రాన్ వైరస్ భయపెడుతోంది. ఈ వైరస్ ధాటికి అన్ని ప్రపంచ దేశాలు భయంతో వణికిపోతున్నాయి. ముఖ్యంగా, అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ఈ వైరస్ శరవేగంగా వ్యాప్తిస్తుంది. పాజిటివ్ కేసులు అమాంతం రెట్టింపు అవుతున్నాయి. 
 
దీంతో అమెరికాకు చెందిన అంటు వ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ తమ దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. అనవసరంగా ప్రయాణాలు చేయొద్దని కోరారు. అలాగే, ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని బూస్టర్ డోస్ టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 
 
చాపకిందనీరులా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వైరస్ ఇప్పటికే 90 దేశాలకు చుట్టేసిందని గుర్తుచేశారు. అమెరికాలో సగానికి పైగా ఈ వేరియంట్ కేసులు బయటపడ్డాయని పేర్కొన్నారు. ఒమిక్రాన్ కారణంగా న్యూయార్క్‌లోని పాజిటివిటీ రేటు 8 శాతం దాటింది. అయితే, ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్నప్పటికీ వ్యాధి తీవ్రత మాత్రం తక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.