ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది రియల్ సినిమా : మంత్రి రాజ్నాథ్ వార్నింగ్
ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందు ఉందని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇరు దేశాలు తలపడ్డాయి కూడా. ఈ సైనిక చర్యలో పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా, భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణుల దెబ్బకు పాకిస్థాన్ దిగివచ్చింది. కేవలం 23 నిమిషాల్లోనే పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది.
ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గుజరాత్ రాష్ట్రం భుజ్లో ఉన్న భారత వైమానిక స్థావరాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిర్ వారియర్స్, భద్రతా దళాలను ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు. అందరూ ఇప్పటిదాకా చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. సరైన సమయం వచ్చినపుడు భారత సాయుధ దళాలు పూర్తి చిత్రాన్ని ప్రదర్శిస్తాయి అని ఆయన స్పష్టం చేశారు.
తమ గడ్డపై ఉగ్రవాద శిబిరాలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేపదే నేరాలు చేసేవారిని ఎలాగైతే నిఘాలో ఉంచుతారో, అలాగే పాకిస్థాన్ను కూడా మేము ప్రొబేషన్లో ఉంచాం. కాల్పుల విరమణ అంటే చర్యలు పూర్తిగా ఆగిపోయినట్టు కాదు. ఒకవేళ పాకిస్థాన్ తన పద్దతులు మార్చుకోకుండా మళ్లీ దుస్సాహసాలకు పాల్పడితే మన దళాలు గట్టి గుణపాఠం చెబుతాయి. మళ్లీ చెబుతున్నాం.. ఈసారి దాడి మరింత తీవ్రంగా ఉంటుంది అని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు.