మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని
దేశంలో సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో కీలక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇంటి యజమాని కీలక ఆధారాలను దాచిపెట్టినట్టు దర్యాప్తులో వెల్లడైంది. రాజా రఘువంశీని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలైన సోనమ్ రఘువంశీ, ఆమె అనుచరులు ఇండోర్లోని ఒక ఫ్లాట్లో తల దాచుకున్నారు. ఆ ఫ్లాట్ యజమాని లోకేంద్ర తోమర్పై మేఘాలయ రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం దృష్టిసారించింది. హత్యకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలను లోకేంద్ర తోమర్ మాయం చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సోనమ్ రఘువంశీ ఇండోర్లోని హీరాబాగ్ ప్రాంతంలో ఉన్న ఫ్లాట్ నుంచి వెళ్లేటపుడు ఒక బ్యాగ్ను అక్కడే వదిలేసింది. ఆ బ్యాగులో నాటు తుపాకీ, ఆమె ఫోన్, రాజాకు చెందిన కొన్ని నగలు, సుమారు ఐదు లక్షల రూపాయల నగదు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ బ్యాగ్ను ఫ్లాట్ యజమాని, ఒక నిర్మాణ రంగ సంస్థ అధినేత అయిన లోకేంద్ర తీసుకెళ్లాడని సిట్ అనుమానిస్తోంది. ఈ కేసులో అరెస్టయిన ప్రాపర్టీ డీలర్ సిలోమ్ జేమ్స్ను విచారిస్తున్న సమయంలో లోకేంద్ర పేరు వెలుగులోకి వచ్చింది. కాగా, నిందితులకు ఫ్లాట్ను అద్దెకు ఇప్పించింది ఈ సిలోమ్ జేమ్స్ కావడం గమనార్హం.
సోనమ్ పోలీసులకు లొంగిపోయిన కాసేపటికే ఫ్లాట్ నుంచి ఆమె బ్యాగ్ను తీసేయమని లోకేంద్ర తనను అడిగాడని సిలోమ్ జేమ్స్ పోలీసులకు చెప్పాడు. అయితే, తాను తీయకపోవడంతో ఫ్లాట్ యజమాని స్వయంగా ఆ బ్యాగ్ను తీసుకెళ్లాడని జేమ్స్ తెలిపాడు.