శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 నవంబరు 2019 (16:38 IST)

పాకిస్థాన్ వెళ్ళాలా వద్దా... నాన్చొద్దు.. తేల్చండి : నవజ్యోత్ సిద్ధూ

పాకిస్థాన్ వెళ్లాలా వద్దా... ఏదో ఒకటి తేల్చండి.. సమస్యను నాన్చొద్దు అంటూ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ కేంద్రాన్ని కోరారు. పాకిస్థాన్‌లోని కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు అనుమతించాలంటూ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. తనకు పాకిస్థాన్ వీసా కూడా మంజూరు చేసిందని వెల్లడించారు. 
 
'ఇప్పటికి పలుమార్లు ఈ విషయాన్ని మీ దృష్టికి తెచ్చినా స్పందన లేదు. కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందో ఇవ్వదో కూడా చెప్పడంలేదు' అంటూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్‌కు రాసిన లేఖలో సిద్ధూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
 
సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన కర్తార్పూర్ సాహిబ్ కారిడార్‌ను పాకిస్థాన్ ప్రభుత్వం ఈ నెల 9న ప్రారంభిస్తోంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ కార్యక్రమానికి తన స్నేహితుడైన సిద్ధూను కూడా ఆహ్వానించారు. కొన్నాళ్ల కిందట ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారం చేస్తుంటే సిద్ధూ కూడా హాజరై శుభాకాంక్షలు తెలిపిన విషయం తెల్సిందే.