శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 నవంబరు 2022 (11:32 IST)

తోటి జవాన్లపై కాల్పులు జరిపిన జవాను.. ఇద్దరు మృతి

gun shot
గుజరాత్ రాష్ట్రంలో విషాదకర ఘటన ఒకటి జరిగింది. తనతో పాటు పని చేసే జవాన్లపై సాటి జవాను కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో భాగంగా జవాన్లు పోర్ బందర్‌కు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. 
 
వచ్చే నెల 1, 5వ తేదీల్లో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం భద్రతా బలగాలను తరలిస్తున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు పారామిలిటరీ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లలో భాగంగా పోర్‌ బందర్‌కు చేరుకున్న జవాన్లకు అధికారులు సమీపంలోని తుఫాను పునరావాస కేంద్రంలో విడిది ఏర్పాటుచేశారు. 
 
అయితే, శనివారం రాత్రి భద్రతా ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా కొంతమంది జవాన్లు బస్సులో వెళుతున్నారు. ఆ సమయంలో జవాన్ల మధ్య వివాదం చెలరేగింది. మాటామాటా పెరగడంతో కానిస్టేబుల్ ఎస్ ఇనౌచాసింగ్ తన ఏకే 47 గన్‌‍తో కాల్పులు జరిపాడు. 
 
దీంతో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిని మెరుగైన చికిత్స కోసం జామ్ నగర్ ఆస్పత్రికి తరలించినట్టు పోర్‌బందర్ కలెక్టర్ ఏఎం శర్మ తెలిపారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుతున్నారు. కాల్పులు జరిపిన జవానును అరెస్టు చేశారు.