గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (16:52 IST)

పుల్వామా ఉగ్రదాడిపై ప్రతీకారం తప్పదు : నరేంద్ర మోడీ

పుల్వామా ఉగ్రదాడిపై ప్రతీకారం తప్పదని పాకిస్థాన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు. ఆయన ఆదివారం బీహార్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుల్వామా ఘటనపై ప్రజల్లో ఎంత ఆగ్రహం పెల్లుబుకుతుందో, తనలోనూ అదే ఆగ్రహం ఉందన్నారు. పాట్నాకు చెందిన వీర జవాను సంజయ్‌ కుమార్‌ సిన్హా, భాగల్‌పూర్‌కు చెందిన రతన్‌ కుమార్‌కు ఆయన నివాళులు అర్పించారు. దేశం కోసం వీర జవాన్లు చేసిన ప్రాణ త్యాగం వృథా పోదని ఆయన చెప్పారు. వీర జవాన్ల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. 
 
ఇకపోతే, దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. 70 ఏళ్లుగా ప్రాథమిక సౌకర్యాలు అందని వారికి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తమమ పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన చెప్పారు. బిహార్‌తో పాటు తూర్పు భారత‌ రాష్ట్రాలకు ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా ఉర్జా గంగా గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు చెప్పారు. 
 
ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలను గ్యాస్‌ పైప్‌లైన్‌లతో కలుపుతున్నామని వెల్లడించారు. మైట్రోరైలు ప్రాజెక్టు పాటలీపుత్ర మీదుగా కూడా నిర్మిస్తున్నామని, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అనేక ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.