1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 మే 2020 (10:32 IST)

భార్యను పాములతో కాటేయించి.. చంపేసిన భర్త.. ఎక్కడ?

Snakebite
కేరళలో ఓ భర్తను భార్యను పక్కా ప్లాన్ ప్రకారమే పాములతో కరిపించి హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే భార్యను పాములతో కరిచి చంపించాడని పోలీసుల విచారణలో తేలింది. వివరాల్లోకి వెళితే.. సూరజ్ ‌(27) ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగిగా పని చేస్తున్నాడు.
 
సూరజ్‌కు ఉత్తర అనే అమ్మాయితో రెండేండ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న బాలుడు ఉన్నాడు. సూరజ్‌కు తన భార్య ఉత్తర ఆస్తి మీద కన్నుపడింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపి ఆస్తిని తన పేర చేయించుకోవాలని కుట్ర చేశాడు. పక్కా ప్లాన్ ప్రకారం.. ఫిబ్రవరిలో పాములు పట్టే వ్యక్తి నుంచి ఓ పామును బెడ్ రూమ్‌లోకి వదిలాడు. ఉత్తరను రక్త పింజర అనే పాము కాటేసినప్పటికీ ఆమె చనిపోలేదు. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించగా కోలుకుంది.
 
అయినప్పటికీ సూరజ్‌ తన ప్రయత్నం వదులుకోలేదు. మళ్లీ ఏప్రిల్‌ నెలలో సురేశ్‌ అనే పాములు వదిలే వ్యక్తి నుంచి కింగ్‌ కోబ్రాను వదిలాడు. మే 6వ తేదీన ఉత్తర నిద్రిస్తున్న బెడ్‌రూంలో కోబ్రాను వదిలేశాడు. ఆ తర్వాత ఉత్తరను కోబ్రా కాటేయడంతో ప్రాణాలు కోల్పోయింది. 6వ తేదీ రాత్రంతా చనిపోయిన భార్య పక్కనే సూరజ్‌ ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం ఏమి తెలియనట్లు తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.
 
ఉత్తరను రెండుసార్లు పాము కాటేయడంతో ఆమె తండ్రికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. తన భార్యను సూరజ్‌ ఆస్తి కోసం చంపాడని పోలీసుల విచారణలో తేలింది. ఉత్తర చనిపోయిన తర్వాత ఆమె లాకర్‌లో ఉన్న బంగారం, నగదు అదృశ్యమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.