1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 జూన్ 2023 (11:24 IST)

ఇక టార్గెట్ మధ్యప్రదేశ్ : చౌహాన్ సర్కారులో ప్రతినెలా ఓ స్కామ్ : ప్రియాంకా గాంధీ

priyanka gandhi
మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయభేరీ మోగించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంది. ఇందుకోసం ఆ పార్టీ మహిళా నేత ప్రియాంకా గాంధీని రంగంలోకి దిగారు. ఆమె జబల్‌పూర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తన ప్రచారంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 
 
చౌహాన్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రతి నెలా ఓ స్కాం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో 225 కుంభకోణాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. రేషన్ పంపిణీ, గనులు, ఈ-టెండర్లు, కరోనాపై పోరు తదితరాల్లో అవినీతి జరిగిందన్నారు. 
 
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, మహిళలకు నెలకు రూ.1,500 నగదు ఇస్తామని హామీ ఇచ్చారు. రూ.500కే వంట గ్యాస్ సిలిండరు, 100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని, పాత పెన్షన్ స్కీం పునరుద్ధరిస్తామని. రైతు రుణాలు మాఫీ చేస్తామంటూ అనేక వరాలు కురిపించారు. పైగా, గత మూడేళ్లలో మధ్యప్రదేశ్‌లో కేవలం 21 ప్రభుత్వ ఉద్యోగాలే ఇచ్చారంటూ ప్రియాంకా ఘాటు విమర్శలు చేశారు.