1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (10:43 IST)

నిద్రలేని రాత్రులు గడుపుతున్న పూణె వాసులు... భయపెడుతున్న "మస్కిటో టోర్నడో"

Mosquito Tornado
మహారాష్ట్రలోని ముఖ్యమైన నగరాల్లో పూణె ఒకటి. ఈ ప్రాంత వాసులు ముస్కిటో టోర్నడో (దోమల సుడిగాలి) భయపెడుతుంది. దీంతో పూణె వాసులు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. ముఠా నది మీదుగా లక్షలాది దోమల గుంపు పూణె నగరంలోని ప్రవేశించాయి. దీంతో ఆ ప్రాంత వాసులు తమ గృహాల తలుపులు తెరవడానికి కూడా గజగజ వణికిపోతున్నారు. ఖరాడీలోని ములా - ముఠా నది నీటి మట్టం పెరగడంతో ఈ దోమలు తమ ప్రాంతంపైకి దండెత్తాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
 
ఈ మస్కిటో టోర్నడోకు సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నగరంలోని ముఠానది మీదుగా కోట్లాది దోమలు సుడిగాలిలా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా ముంధ్వా, కేశవనగర్, ఖారడీ ప్రాంతాల్లో ఇవి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. 
 
దోమల సుడిగాలితో అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రాంతాల్లోని విలాసవంతమైన హై రైజ్ భవనాల్లో నివసిస్తున్న వారు బాల్కనీ డోర్లు తెరిచేందుకు కూడా భయపడుతున్నారు. చిన్నారులు వెళ్లకుండా పార్కులు, గార్డెన్లు మూసివేశారు. ఈ దోమల సుడిగాలిపై చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలను శుభ్రం చేయాలని కోరుతున్నారు. 
 
ఈ దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికున్తున్యా లాంటి జబ్బుల బారినపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరాడీలోని ములా-ముఠా నదిలోని నీటిమట్టం పెరగడమే దోమల సుడిగాలికి కారణమని తెలుస్తోంది. పూణె మునిసిపల్ కార్పొరేషన్ రెండు రోజులక్రితం అదనపు నీటిని తొలగించే పని ప్రారంభించినప్పటికీ పరిస్థితిలో మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు.