గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 10 జూన్ 2018 (11:27 IST)

'అల్లా' అనుగ్రహం కోసం కుమార్తెను బలిచ్చిన తండ్రి.. ఎక్కడ?

పవిత్ర రంజాన్ మాసంలో అల్లా కరుణాకటాక్షాల కోసం కన్నబిడ్డను చంపేశాడో కసాయి తండ్రి. ఈ దారుణానికి పాల్పడేముందు ఆ చిన్నారికి ఇష్టమైన అన్ని రకాల చిరుతిండ్లు తినిపించిమరీ పీకకోసి చంపేశాడు. తాజాగా వెలుగులోకి

పవిత్ర రంజాన్ మాసంలో అల్లా కరుణాకటాక్షాల కోసం కన్నబిడ్డను చంపేశాడో కసాయి తండ్రి. ఈ దారుణానికి పాల్పడేముందు ఆ చిన్నారికి ఇష్టమైన అన్ని రకాల చిరుతిండ్లు తినిపించిమరీ పీకకోసి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
కుమార్తెను తీసుకుని మార్కెట్‌కు వెళ్లాడు. నువ్వంటే నాకెంతో ఇష్టమని ఊసులు చెప్పాడు. ఇష్టమైన మిఠాయిలు కొని తినిపించాడు. తండ్రి మాటలను నిజమేనని నమ్మేసిందా చిన్నారి. కానీ, తండ్రి చెబుతున్నవన్నీ అబద్ధాలని, తన ప్రాణం తీసేందుకు కుట్ర పన్నాడని తెలుసుకోలేకపోయింది. కుటుంబ సభ్యులు తేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 
 
రాజస్థాన్‌ రాష్ట్రంలోని పైపర్ సిటీకి చెందిన నవావ్ అలీకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రంజాన్ మాసం కావడంతో ఉపవాస దీక్ష చేపట్టాడు. గురువారం సాయంత్రం పెద్ద కుమార్తె రిజ్వానా (4)ను మార్కెట్‌కు తీసుకెళ్లి ఆమెకు ఇష్టమైన స్వీట్లు కొనిపెట్టాడు. ఆ రాత్రి భార్య, పిల్లలతో కలిసి పై అంతస్తులో నిద్రపోయాడు. 
 
శుక్రవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా రిజ్వానాను తీసుకుని కిందికి వచ్చాడు. ఖురాన్‌ను పఠిస్తూ కత్తితో కుమార్తె గొంతు కోసి చంపేశాడు. అనంతరం పైకెళ్లి నిద్రపోయాడు. తెల్లారిన తర్వాత కిందికి వచ్చిన అలీ భార్య షాక్‌కు గురైంది. రక్తపు మడుగులో పడి ఉన్న కుమార్తెను చూసి గుండెలవిసేలా రోదించింది. 
 
అంతా చూస్తున్న అలీ, రిజ్వానాను పిల్లి మెడకొరికి చంపేసి ఉంటుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. విషయం పోలీసులకు చేరడంతో వారొచ్చి చిన్నారిది హత్యగా నిర్ధారించారు. అలీని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నిజం కక్కాడు. అల్లా అనుగ్రహం కోసమే కుమార్తె‌ను బలిచ్చినట్టు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.