1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (16:05 IST)

రామసేతు మానవ నిర్మితమే.. సహజసిద్ధమైనది కాదు

తమిళనాడు పంబన్, శ్రీలంకలో మన్నార్‌ దీవుల మధ్య సముద్రంలో రామసేతు వంతెన నిర్మించారని చెబుతారు. రామసేతు, ఆడమ్‌ బ్రిడ్జి అని రెండు పేర్లు కలిగిన ఈ మార్గం సముద్రంలో సహజసిద్ధంగా ఏర్పడిందా లేక మానవ నిర్మితమా అనే విషయాలపై భారీ చర్చ జరిగింది. ఆ మధ్య అమెరికా డిస్కవరీ కమ్యూనికేషన్స్‌ సంస్థకు చెందిన 'సైన్స్‌ చానల్‌' రూపొందించిన ఓ కార్యక్రమంలో 'రామసేతు' నిజంగానే మానవ నిర్మితమేననడానికి ఆధారాలు ఉన్నాయని తేల్చారు. 
 
నాసా ఉపగ్రహాల చిత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చామంది. ఆ ప్రాంతంలోని ఇసుక సహజసిద్ధంగా ఏర్పడినదే కాగా, దానిపై ఉన్న రాళ్లు మాత్రం కృత్రిమంగా తీసుకొచ్చి పేర్చినట్లు ఉన్నాయని భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఆ కార్యక్రమంలో చెప్పారు. 
 
రామసేతు దాదాపు 5 వేల ఏళ్ల క్రితం నిర్మించి ఉంటారనీ, ఇది మానవుల అద్భుత నిర్మాణమని కార్యక్రమంలో సైన్స్‌ చానల్‌ పేర్కొంది. రామ సేతు ప్రాంతంలో ఉన్న రాళ్లు 7 వేల ఏళ్ల పురాతనమైనవి కాగా, ఇసుక మాత్రం అంత పాతది కాదని తమ పరిశోధనలో తేలినట్లు మరో శాస్త్రవేత్త చెప్పారు.
 
వానరులు సముద్రంలోకి విడిచిన రాళ్ల మీద రామనామం ఉండటంతో అవన్నీ ఒక్కచోటికి చేరి వారధిగా తయారయ్యాయి. కేవలం ఐదు రోజుల్లోనే 130 కిలోమీటర్ల వారధిని నిర్మించారని చెబుతారు. తాజాగా అమెరికాకు చెందిన సైన్స్‌ చానెల్‌ ఒకటి మొదటి వాదననే సమర్ధిస్తూ ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది.
 
పలువురు భూగర్భ, పురాతత్వ శాస్త్రవేత్తలు, ఉపగ్రహ చిత్రాలను పరిగణలోకి తీసుకుని ఆ నిర్మాణం సహజసిద్ధమైనది కాదని, మానవ నిర్మితమైనదేనని తేల్చింది.