శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 17 అక్టోబరు 2020 (13:22 IST)

పేర్లు నమోదు చేసుకుంటేనే శబరిమలకు అనుమతి

గడిచిన కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం, మరోవైపు ప్రఖ్యాత శబరిమల యాత్రకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. ఇతర రాష్ర్టాల నుంచి శబరిమల యాత్రకు వచ్చే భక్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ మార్గదర్శకాలు జారీ చేసింది. 
 
మార్గదర్శకాలు
శబరిమల యాత్రకు వచ్చే భక్తులు ముందుగానే కేరళ పోలీసు శాఖ అభివృద్ధి చేసిన వర్చువల్‌ క్యూ పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకోవాలి. దీని కోసం https:/z/sabarimalaonline.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. 
పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఆలయంలోకి అనుమతి.

వారాంతాల్లో రోజుకు 2 వేల మంది చొప్పున, మిగిలిన రోజుల్లో రోజుకు వెయ్యి మందికి చొప్పున మాత్రమే పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకునే వీలుంది. పరిస్థితులను బట్టి మార్పులు ఉండొచ్చు. దర్శనానికి 48 గంటల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. నెగెటివ్‌ ఫలితం వచ్చిన వారికి మాత్రమే ఆలయ ప్రవేశానికి అనుమతి.

ముందుగా టెస్టులు చేసుకోని వారికి ప్రవేశ మార్గంలోనూ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, కరోనా లేదని తేలితేనే ఆలయంలోనికి అనుమతిస్తారు. పదేండ్ల లోపు, 60 ఏండ్లు పైబడిన వారికి అనుమతి నిరాకరణ. దీర్ఘకాలిక గుండె జబ్బులతో బాధపడుతున్న వారిని కూడా దర్శనానికి అనుమతించరు.
 
యాత్రకు వచ్చే భక్తులు ఆయుష్మాన్‌ భారత్‌, బీపీఎల్‌ తదితర ఆరోగ్యబీమా కార్డులను వెంట తెచ్చుకోవాలి.
స్వామికి నెయ్యి అభిషేకాలు, పంపా నదిలో స్నానాలు, సన్నిధానంలో రాత్రి బసకు అనుమతి నిరాకరణ.
 
కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి చివరి వారంలో మూతబడిన శబరిమల ఆలయం తొలిసారిగా శుక్రవారం సాయంత్రం తెరుచుకుంది. నెలవారీగా నిర్వహించే పూజల్లో భాగంగా ఐదు రోజుల పాటు ఆలయాన్ని తెరిచారు. భక్తులకు శనివారం ఉదయం ఆలయ ప్రవేశం కల్పించారు. రోజుకు 250 మంది చొప్పున మాత్రమే అనుమతిస్తారు.

శబరిమల యాత్రకు ప్రభుత్వం జారీ చేసిన అన్ని మార్గదర్శకాలను.. ఈ ఐదు రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తులు కూడా పాటించాలి.