1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 5 అక్టోబరు 2021 (15:51 IST)

ఆ దుర్మార్గులు రైతులనే కాదు... జర్నలిస్టునూ హత్య చేశారు...

ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్‌లో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా టెని కుమారుడు ఆశిష్, నిరసన తెలుపుతున్న రైతులపైకి కారు తోలి నలుగురు రైతులను పొట్ట‌న‌పెట్టుకున్న సంఘటన‌లో ఒక జర్నలిస్ట్ కూడా అమరుడయ్యాడు. లఖింపూర్ ఘటన సమయంలో నిఘాసన్‌కి చెందిన  జర్నలిస్ట్ రామన్ కశ్యప్ అదృశ్యమయ్యారు. ఆయ‌న గురించి ఆచూకీ తీయ‌గా, చివ‌రికి ఆ జర్నలిస్ట్ మృతదేహాన్నిరాత్రి ఆసుపత్రిలో కనుగొన్నారు.
 
అతను సాధనా న్యూస్ ఛానల్ వీడియో జర్నలిస్ట్. సంఘటన స్థలానికి సంబంధించిన విజువల్స్ తీస్తుండగా, వేగంగా వచ్చిన వాహనం వారిని ఢీకొనడంతో రోడ్డు పక్కన ఉన్న గుంటలో పడిపోయాడు. రామన్ కశ్యప్‌కు ఇద్దరు చిన్న కుమార్తెలు ఉన్నారు. చిన్న అమ్మాయి పాలు తాగే పసిపాప. ఇంత దుర్మార్గంగా జ‌ర్న‌లిస్టును పొట్ట‌న‌పెట్టుకున్నార‌ని స్థానిక జర్నలిస్ట్ లు చాలా ఆగ్రహంతో ఉన్నారు.  మృతుని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, యాభై లక్షలు పరిహారంగా ఇవ్వాల‌ని జ‌ర్న‌లిస్టు సంఘాలు డిమాండు చేస్తున్నాయి. హత్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. 
 
ప్రెస్ జనరల్ ఆఫ్ ఇండియా ధీరజ్ గుప్తా, శిశిర్ శుక్లా సీనియర్ అధికారులతో సహా వందలాది మంది జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. జ‌ర్న‌లిస్టు కుటుంబాన్ని ఆదుకోవాల‌ని, పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.