బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 నవంబరు 2020 (09:46 IST)

భారత అమ్ములపొదిలోకి మరో రెండు రాఫెల్ యుద్ధ విమానాలు!

భారత రక్షణ శాఖ మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఫ్రాన్స్ కొనుగోలు చేసిన అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు దేశ రక్షణ శాఖలోకి వచ్చి చేరాయి. ఇపుడు మరో మూడు విమానాలు వచ్చాయి. ఈ మూడు విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్‌కు నాన్‌స్టాఫ్‌గా ప్రయాణం చేయడం గమనార్హం. ఈ మూడింటితో కలిపి మొత్తం 8 రాఫెల్ ఫైటర్ జెట్స్ ఇప్పుడు వాయుసేన అమ్ములపొదిలో ఉన్నట్లయింది. 
 
ఈ విమానాలు గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్‌లో ల్యాండ్ అయ్యాయని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. బుధవారం రాత్రి 8.14 గంటల సమయంలో రెండో బ్యాచ్ రాఫెల్ విమానాలు ఇండియాకు చేరాయని ఐఏఎఫ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
 
ఈ విమానాలకు అవసరమైన అదనపు ఇంధనాన్ని ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్, మార్గమధ్యంలో గాల్లోనే నింపిందని వాయుసేన ప్రకటించింది. ఫ్రాన్స్‌లోని ఇస్ట్రీస్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన ఇవి 8 గంటలకు పైగా ప్రయాణించాయని, మొత్తం 3,700 నాటికల్ మైళ్ల దూరాన్ని సునాయాసంగా ప్రయాణించాయని పేర్కొంది. 
 
కాగా, మొత్తం రూ.59 వేల కోట్లతో 36 విమానాలను భారత్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఓ వైపు చైనాతో, మరోవైపు పాకిస్థాన్‌తో సరిహద్దుల్లో సవాళ్లు ఎదురవుతున్న వేళ, ఈ విమానాలు మరింత బలాన్నిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక, కొత్తగా విమానాలు రావడంపై స్పందించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాయుసేనకు అభినందనలు తెలిపారు.