1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (12:09 IST)

మళ్లీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చొంటానా? ప్రజలను అడుగుతున్న మధ్యప్రదేశ్ సీఎం

shivraj singh chowhan
మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం అధికార బీజేపీ మళ్లీ పవర్‌లోకి వచ్చేందుకు ఆ పార్టీని నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ సైతం విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే, తాను మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానా అని తన సభలకు హాజరయ్యే ప్రజలను అడుగుతున్నారు. తాజాగా జరిగిన ఓ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి పై విధంగా ప్రశ్నించారు. దీంతో మీరు మరోమారు సీఎం కావడం తథ్యమని సభకు హాజరైన వారు ముక్తకంఠంతో నినందించారు.
 
ఈ యేడాది ఆఖరులో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. అక్కడ రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిండోరిలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రజలను ఉద్దేశించి అన్నారు. తాను మంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నానా, లేదా? ఈ ప్రభుత్వమే మళ్లీ గెలుస్తుందా? లేదా? నేను మరోసారి ముఖ్యమంత్రిని అవుతానా? అని ప్రశ్నించారు.
 
అలాగే, కేంద్ర, రాష్ట్రాలలో బీజేపీనే విజయం సాధించాలని భావిస్తున్నారా? ప్రధాని నరేంద్ర మోడీ పాలన కొనసాగాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నలు సంధించారు. ఆయన ప్రశ్నలకు ప్రజలు సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాము పోటీ చేసేందుకు ప్రజల అనుమతి తీసుకుంటామన్నారు. అంతకుముందు కొన్ని సమావేశాల్లో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల తన సొంత నియోజకవర్గం బుధ్నిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని, తనను మళ్లీ పోటీ చేయమంటారా? అని ప్రశ్నించారు.