గురువారం, 11 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 డిశెంబరు 2025 (21:06 IST)

కాంగ్రెస్ ఓటమికి ఆ పార్టీ నాయకత్వమే కారణం : అమిత్ షా

amit shah
కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఈవీఎంలు లేదా ఓటు చోరీ కాదని, ఆ పార్టీ నాయకత్వమే ప్రధాన కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. లోక్‌సభలో ఆయన బుధవారం ప్రసంగించారు. ముఖ్యంగా, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విపక్షాలు చేస్తున్న రాద్దాంతంపై ఆయన స్పందించారు. భారత రాజ్యాంగం ప్రకారమే ఎన్నికల సంఘం ఎస్ఐఆర్‌ను చేపడుతోందన్నారు. ఇకపై తప్పుడు మార్గాల్లో గెలవలేమని భావించిన విపక్షాలు ఎస్ఆర్‌ఐ ఆందోళనలు చేస్తున్నాయని ఆరోపించారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఈవీఎంలు, ఓటు చోరీ కాదని, కేవలం ఆ పార్టీ నాయకత్వమే ప్రధాన కారణమన్నారు. అక్రమ చొరబాటుదారులను ఓటరు జాబితాలో ఉంచేందుకే ఆందోళనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
 
'2004 వరకు ఏ పార్టీ కూడా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వ్యతిరేకించలేదు. ఓటరు జాబితాలో చనిపోయిన వారిని, విదేశీయులను గుర్తించి, తొలగించేందుకే దీన్ని చేపడుతున్నాం. భారత ఎన్నికల ప్రక్రియలో అక్రమ వలసదారులు భాగస్వామ్యం కావాలా? ఓటరు జాబితాలో అక్రమ వలసదారులను ఉంచేందుకే విపక్షాలు ఎస్‌ఐఆర్‌ను లేవనెత్తుతున్నాయి' అని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. 
 
అమిత్‌ షా ప్రసంగిస్తున్న సమయంలోనే విపక్షాలు వాకౌట్‌ చేయడంపై స్పందిస్తూ.. అక్రమ వలసదారులను గుర్తించి, తొలగించి, వెనక్కి పంపించడమే ఎన్డీయే విధానమని, విపక్షాలు వాకౌట్‌ చేసినా సరే.. ఓటరు జాబితాలో ఏ ఒక్క అక్రమ వలసదారుడు ఉండటానికి వీల్లేదన్నారు. దేశంలో ఇటువంటి వారిని లేకుండా చేయాలని అనుకుంటున్నామన్నారు. ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తే పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు నుంచి ఆయా పార్టీలు తుడిచి పెట్టుకుపోతాయని విపక్ష పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.