శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (19:35 IST)

కాంగ్రెస్ పార్టీ ఇంటీరియం ప్రెసిడెంట్‌గా సోనియా గాంధీ..

కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాయక కమిటీ అయిన సీడబ్ల్యూసీ భేటీ ముగిసింది. గత కొన్ని రోజులుగా అత్యంత ఉత్కంఠ రేపిన ఈ సమావేశం సోమవారం జరిగింది. అయితే, ఈ సమావేశంలో పార్టీ అధ్యక్ష పదవి మార్పుపై సుధీర్ఘ చర్చ జరిగింది. కానీ, తుది నిర్ణయం మాత్రం తీసుకోలేకపోయింది. మెజార్టీ నేతలంతా సోనియా వైపే మొగ్గు చూపారు. ఫలితంగా ఆమె మధ్యంతర అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. 
 
నిజానికి వందేళ్ల ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం నాయకత్వ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న అంశంపై పార్టీలో విస్తృతంగా చర్చసాగుతోంది. ఇదే అంశంపై సీడబ్ల్యూసీ సభ్యుల వ్యవహాశైలిపై  23 మంది సీనియర్ నేతలు పార్టీ అధినేత్రి సోనియాకు లేఖాస్త్రాలు సంధించారు. 
 
ఈ క్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సోమవారం సమావేశమైంది. ఈ భేటీ హైడ్రామా నడుమ సాగింది. అయితే, పార్టీ ప్రెసిడెంట్ పదవి ఎవరికి అప్పగించాలన్న దానిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సోనియానే మధ్యంతర చీఫ్‌గా కొనసాగనున్నారు. పార్టీ బాధ్యతల నుంచి తనను తప్పించాలంటూ సోనియానే స్పష్టం చేసినా, ఈ పరిస్థితుల్లో మరో మార్గం లేక పార్టీ సీనియర్లు ఆమెపైనే భారం వేశారు.
 
అంతకుముందు ఈ సమావేశంలో పార్టీ సీనియర్లు లేఖలు రాయడాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. వీరంతా కూడబలుక్కుని, బీజేపీతో కుమ్మక్కై లేఖలు రాశారంటూ సంచలన ఆరోపణలు చేశారు
 
కాంగ్రెస్ నేతలు రాసిన లేఖపై సీడబ్ల్యూసీ సమావేశంలో వాడీవేడీగా చర్చలు జరుగుతోన్న విషయం తెలిసిందే. 23 మంది సీనియర్లు లేఖ రాయడంపై రాహుల్‌ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎలా బయటకు వెళ్తున్నాయని ప్రశ్నించారు. కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీ ఏజెంట్లంటూ రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్‌ , కపిల్ సిబాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
రాహుల్ ఆరోపించినట్లు ఒకవేళ తాను బీజేపీ ఏజెంట్‌నే అయితే, తాను వెంటనే రాజీనామా చేసేసి బయటికి వెళ్లిపోతానని ఆజాద్ అన్నారు. సీడబ్ల్యూసీ సభ్యుల వ్యవహార శైలి బాగోలేకపోవడంతోనే తాము లేఖ రాశామని చెప్పారు. 
 
ఈ వ్యాఖ్యలపై సీనియర్ నేతలు కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్ తీవ్రంగా ఖండించారు. తాము బీజేపీతో కుమ్మక్కయ్యామని అనడం ఏంటంటూ కపిల్ నిలదీశారు. రాజస్థాన్ హైకోర్టులో విజయవంతంగా వాదించి కాంగ్రెస్‌ను కాపాడామని, మణిపూర్‌లో బీజేపీని దించి కాంగ్రెస్‌ను రక్షించామని, తాను 30 ఏళ్లలో బీజేపీకి అనుకూలంగా ఒక్క ప్రకటనైనా చేయడం చూశారా? అని ప్రశ్నించారు. 
 
అలాగే, గులాం ఆజాద్ కూడా ప్రశ్నించారు. తాను బీజేపీతో కుమ్మక్కైనట్టు నిరూపిస్తే ఈ క్షణమే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతానంటూ తేల్చి చెప్పారు. ఆ తర్వాత రాహుల్ వ్యాఖ్యలు టీ కప్పులో తుఫానులా సద్దుమణిగిపోయాయి.