1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 16 నవంబరు 2017 (14:35 IST)

రాముడు కోసం రవిశంకర్ రాయబారం...

వందల సంవత్సరాలుగా నలుగుతున్న అయోధ్య సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు తాను మధ్యవర్తిత్వం నెరపుతానని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రకటించారు. ఆ తర్వాత ఆయన తన పనిని ప్రారంభి

వందల సంవత్సరాలుగా నలుగుతున్న అయోధ్య సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు తాను మధ్యవర్తిత్వం నెరపుతానని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రకటించారు. ఆ తర్వాత ఆయన తన పనిని ప్రారంభించారు. ఇందులోభాగంగా, ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమయ్యారు. వీరిద్దరూ అర్థగంటపాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. 
 
అంతేకాకుండా, వివాదాస్పద అయోధ్య బాబ్రీ మసీదు - రామమందిర స్థలాన్ని గురువారం సందర్శించారు. ఈ వివాదంతో సంబంధమున్నవారితో చర్చలు జరుపనున్నారు. ఇక్బాల్ అన్సారీ, హాజీ మెహబూబ్‌తో చర్చించనున్నారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామమందిరానికి ఒక పరిష్కారం కనుగొంటామని, వివాదాస్పద స్థలంలో రామమందిరాన్ని నిర్మిస్తామని చెపుతున్నారు. ఇందుకోసం అన్ని పార్టీలనూ ఒప్పిస్తామని చెప్పారు. చర్చలు ఫలప్రదమవుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. 
 
రామమందిర నిర్మాణానికి నో చెప్పడం సరికాదని... మసీదును కూడా సమీపంలోనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే శ్రీ శ్రీ రవిశంకర్ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం లేదని విశ్వహిందూపరిషత్ తెలిపింది. ఆయన విఫలమవుతారని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ చెప్పారు. 
 
మరోవైపు రవిశంకర్‌ను కలుసుకునేందుకు సున్నీ వక్ఫ్‌బోర్డు నిరాకరించింది. సున్నీ వక్ఫ్‌బోర్డుకు మద్దతుగా ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లాబోర్డు కూడా శ్రీశ్రీ రవిశంకర్‌తో చర్చలు జరిపేందుకు నిరాకరించింది. శ్రీశ్రీ మధ్యవర్తిత్వానికి ఎలాంటి లీగల్‌ స్టాండ్‌ లేదని ఈ రెండు సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.