1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 మే 2021 (09:00 IST)

జస్టిస్ ఎన్వీ రమణ మెలికతో కలిసొచ్చిన అదృష్టం : సీబీఐ కొత్త బాస్‌గా జైశ్వాల్

సీబీఐ డైరెక్టర్‌గా ఎంపిక చేసే వారి సర్వీసు కనీసం ఆరు నెలల కంటే తక్కువ ఉండరాదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇపుడు సీబీఐ కొత్త డైరెక్టర్ ఎంపికలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ రూల్‌ను ప్రస్తావించారు. దీంతో సీబీఐ మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్‌కు అదృష్టం కలిసివచ్చింది. ఈయన కంటే మరికొందరు సీనియారిటీ పరంగా ముందు ఉన్నప్పటికీ.. ఆరు నెలల రూల్ అడ్డంకిగా మారింది. దీంతో సీబీఐ కొత్త డెరెక్టరుగా జైశ్వాల్‌ను కేంద్రం నియమిస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఈ ప్రక్రియ కోసం మొత్తం 109 మంది పేర్లను ఎంపిక చేసిన వడపోసిన త్రిసభ్య కమిటీ చివరికి మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్‌ను ఎంపిక చేసింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు. 
 
సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్‌సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురిలతో కూడిన త్రిసభ్య కమిటీ సుదీర్ఘ వడపోత అనంతరం జైశ్వాల్‌ను ఎంపిక చేసింది.
 
నిజానికి సీబీఐ నూతన డైరెక్టర్ పదవి రేసులో సుబోధ్ కుమార్ ముందు నుంచి ఉన్నారు. సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్ కేఆర్ చంద్ర, కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి వీఎస్కే కౌముది కూడా పోటీలో నిలిచినప్పటికీ సుబోధ్ కుమార్ వీరిద్దరి కంటే సీనియర్ కావడంతో ఆయనకే ఈ పదవి దక్కింది. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న రిషికుమార్ శుక్లా ఫిబ్రవరిలోనే పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి పూర్తిస్థాయి డైరెక్టర్ లేకుండానే సీబీఐ పనిచేస్తున్న విషయం తెల్సిందే.