1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (11:27 IST)

రైలులో ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడి అరెస్టు

Kerala Train
Kerala Train
ఇటీవల ఆళప్పుళ - కన్నూరు ఎక్స్‌ప్రెస్ రైలులో సాటి ప్రయాణికులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో నిందితుడుని పోలీసులు మహారాష్ట్రలో అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత నిందితుడు కాలిన గాయాలతో మహారాష్ట్రలోని రత్నగిరికి పారిపోయారు. అక్కడ నుంచి పోలీసుల కన్నుగప్పి పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని కేరళ పోలీసులకు అప్పగించారు. ఈ నిందితుడిని ఢిల్లీకి చెందిన షారూక్ సైఫీగా గుర్తించారు.
 
గత ఆదివారం రాత్రి ఎక్స్‌ప్రెస్ రైలులో కోళికోడ్ దాటిన తర్వాత కొరపుళా రైల్వే వంతెన వద్దకు చేరుకున్న సమయంలో నిందితుడి సాటి ప్రయాణికులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రాత్రి 9.45 గంటల సమయంలో డీ1 బోగీలోకి ప్రవేశించిన సైఫీ.. అక్కడున్న ప్రయాణికులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ఓ చిన్నారితో పాటు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో నిందితుడు రైలు దూకి తప్పించుకుని పారిపోయాడు. 
 
ఈ నేపథ్యంలో నిందితుడిని అరెస్టు చేసేందుకు కేరళ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్నంలో దాడి తర్వాత రత్నగిరికి చేరుకున్న సైఫీ ఓ ఆస్పత్రిలో చేరి కాలిన గాయాలకు చికిత్స చేయించుకున్నాడు. అక్కడ నుంచి పారిపోతుండగా రైల్వే స్టేషన్‌లో పోలీసులకు చిక్కాడు. వియం తెలిసి అక్కడకు చేరుకున్న కేరళ పోలీసుల అతన్ని అరెస్టు చేశారు. రైలులో ఘాతుకానికి పాల్పడింది తానేనని నేరాన్ని అంగీకరించాడు. అయితే ఎలా ఎందుకు చేశాడన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు.