శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (13:07 IST)

నా బిడ్డ ప్రీతిది ఆత్మహత్య కాదు.. హత్యే.. : సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి..

medico preethi
తన బిడ్డ ధరావత్ ప్రీతిది ఆత్మహత్య కాదని హత్యేనని ఆమె తండ్రి నరేందర్ ఆరోపిస్తున్నారు. అందువల్ల ప్రీతి మృతిపై సత్వరం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి హంతకులెవరూ తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. కాకతీయ వైద్య కాలేజీకి చెందిన పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఈ నెల 22వ తేదీన ఆపరేషన్ థియేటర్‌లో మత్తు ఇంజెక్షన్ వేసుకుంది. దీంతో అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను తొలుత వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి, ఆస్పత్రి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. అయితే, ఆమె ఆదివారం రాత్రి చనిపోయారు. దీంతో ప్రీతి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 
 
దీనిపై ప్రీతి తండ్రి నరేందర్ మాట్లాడుతూ, తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని చెప్పారు. ప్రీతికి ఎవరో విషపు ఇంజెక్షన్ ఇచ్చారని, ఈ కోణంలోనే పోలీసులు విచారణ జరపాలని ఆయన కోరారు. ప్రీతి మృతి చెందడానికి గల కారణాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శవపరీక్ష రిపోర్టులు కూడా తమకు ఇవ్వలేదని చెప్పారు. 
 
ముఖ్యంగా, కాకతీయ వైద్య కాలేజీ ప్రిన్సిపాల్, హెచ్.ఓ.డిలను సస్పెండ్ చేసిన తర్వాత ప్రీతి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేస్తేనే ప్రీతి మృతిపై పూర్తి వివరాలు, నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పారు. ఘటనలో సైఫ్ తో ఇంకా ఐదారుగురు ఉన్నారని ఆరోపించారు. ప్రీతి లాంటి వాళ్లు బలికాకుండా చర్యలు తీసుకోవాలని నరేందర్‌ అన్నారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తే తన కుమార్తె తిరిగి వస్తుందా? ఈ దారుణానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.