శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

పదో తరగతి విద్యార్థిని కోసం గ్రీన్ కారిడార్.. ఎందుకు?

kolkata cop
పదో తరగతి విద్యార్థిని కోసం ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటుచేశారు. పరీక్షా సమయం మించిపోవడంతో ఆ విద్యార్థిని పరీక్షా కేంద్రానికి తరలించేందుకు ఈ గ్రీన్ కారిడార్‍ను ఏర్పాటుచేసి, బాలికను సకాలంలో పరీక్షా కేంద్రానికి చేర్చారు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని హౌరాలో జరిగింది. 
 
సాధారంగా అత్యవసర ఆపరేషన్ల కేసుల్లో అవయవ భాగాలను ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలించే సమయంలోనే ఈ తరహా గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేసి వాటిని సకాలంలో చేర్చుతుంటారు. అయితే, ఇక్కడ పదో తరగతి విద్యార్థిని కోసం హౌరా ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఒకరు వ్యక్తిగత రిస్క్ తీసుకుని ఈ గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. 
 
బెంగాల్‌లోని హౌరా వంతెన సమీపంలో ఓ బాలిక స్కూల్ యూనిఫాం ధరించి ఏడుస్తూ అటువైపు వెళ్తున్న వారిని సాయం కోసం అర్థించసాగింది. అదేసమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సావిక్ చక్రవర్తి ఆ బాలికను చూసి ఆరా తీశాడు.
 
తాను శాయంబజార్‌లోని ఆదర్శ్ శిక్షనికేతన్‌లో పదో తరగతి పరీక్ష రాస్తున్నానని, అక్కడకి వెళ్లాల్సి ఉందని సాయం చేయాలని ప్రాధేయపడింది. మరి ఇంట్లో వారు ఎవరు రాలేదా? అని అడిగారు. దానికి ఆ బాలిక సమాధానం చెబుతూ, తాతయ్య చనిపోయారని, ఇంట్లో వారంతా అంత్యక్రియలకు వెళ్లారని చెప్పింది. 
 
దీంతో చలించిపోయిన ఇన్‌స్పెక్టర్ ఆ బాలికను తన అధికారిక వాహనంలో ఎక్కించుకుని పరీక్ష కేంద్రానికి బయలుదేరారు. పరీక్షకు సమయం సమీపిస్తుండటంతో ఆ మార్గంలో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలంటూ ఉన్నతాధికారులు అనుమతి లేకుండా ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. 
 
దీంతో వారు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్ణీత సమయానికి ఆ బాలికను పరీక్షా కేంద్రానికి చేర్చారు. కోల్‌‍కతా పోలీసులు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో అది కాస్త వైరల్ అయింది. ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఇన్‌స్పెక్ట‌‍‌ర్‌ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.