1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (09:03 IST)

5 కేజీల బంగారు నగలతో వచ్చి నామినేషన్ దాఖలు చేసి వ్యక్తి!

తమిళనాడు రాష్ట్ర శాసనసభకు వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇలాంటి వారిలో హరి నాడార్ ఒకరు. ఈయన ఆళంకుళం అనే అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే, ఇతనిలో ప్రత్యేక ఏముందనే కాదా మీ సందేహం. ఇక్కడే అసలు విషయం దాగుంది. 
 
ఈయన నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చినపుడు ఆయన ఒంటిపై ఏకంగా 5 కేజీల బంగారు ఆభరణాలు ధరించివచ్చారు. తమిళనాడుకు చెందిన హరి నాడార్ ఆళంగుళం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పేపర్లు దాఖలు చేశారు. 
 
ఈ క్రమంలో ఆయన ఒంటిపై ఏకంగా 5 కేజీల బంగారు ఆభరణాలు ధరించి స్థానిక ఎన్నికల కార్యాలయానికి వచ్చారు. ఆయన వాలకం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తన వద్ద మొత్తం 11.2 కేజీల బంగారం ఉందని హరి నాడార్ నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు.
 
ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా తీసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఉదంతం నెటిజన్లను కూడా అమితంగా ఆకర్షిస్తోంది. నిజాయతీగా తన ఆస్తుల వివరాలు వెల్లడించాడంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆయన్ను దక్షిణాది బప్పీ లహరి అంటూ సంబోధిస్తున్నారు. 

కాగా, 234 అసెంబ్లీ సీట్లున్న తమిళనాడు రాష్ట్ర శాసనసభకు ఏప్రిల్ 6వ తేదీన ఒకే దశలో పోలింగ్ జరుగనుండగా, మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.