శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2020 (19:18 IST)

విలవిలలాడిపోతున్న మందుబాబులు .. మద్యం లేక ఆత్మహత్య

ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కమ్మేసింది. ఈ వైరస్ బారి నుంచి ప్రజలను రక్షించేందుకు దేశాలకు దేశాలే లాకౌట్‌ ప్రకటిస్తున్నాయి. అలాగే, అత్యసవర సేవలు మినహా మిగిలిన సేవలన్నీ బంద్ అయ్యాయి. అలాగే, మద్యం షాపులు, బార్లు, రెస్టారెంట్లు కూడా మూసివేశారు. దీంతో మద్యంబాబులు విలవిల్లాడిపోతున్నారు. పలు చోట్ల మద్యం కోసం అర్రులు చాస్తున్నారు. తాజాగా ఓ తాగుబోతు మద్యం లేదని ఆత్మహత్యకు చేసుకున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళ రాష్ట్రంలోని త్రిశూర్‌ జిల్లాలోని తువనూర్‌కు చెందిన సనోజ్‌(35) ఆత్మహత్య చేసుకున్నాడు. నిత్యం మద్యం సేవించే సనోజ్‌కు గత రెండు రోజుల నుంచి మద్యం లేకపోయే సరికి తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
అలాగే, కేరళ వ్యాప్తంగా 10 మంది మందు బాబులు.. డీఅడిక్షన్‌ సెంటర్‌లో చేరారు. మందుబాబులకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి.. వారిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మద్యం షాపులు మూసివేత కారణంగా.. ఇంటికే మద్యం సరఫరా చేసే విధంగా అనుమతివ్వాలని ఓ వ్యక్తి కేరళ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. 
 
ఈ పిటిషన్‌పై కోర్టు తీవ్రంగా స్పందించింది. పనికిమాలిన పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడింది. పిటిషనర్‌కు కోర్టు రూ.50 వేలు జరిమానా విధించింది. రెండు వారాల్లోగా రూ.50 వేలు చెల్లించకపోతే.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. దీంతో మద్యంబాబులు ఉలుకుపలుకు లేకుండా మిన్నకుండిపోయారు.