శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: శుక్రవారం, 7 జూన్ 2019 (16:28 IST)

భర్త శవం కోసం పిచ్చ కొట్టుడు కొట్టుకున్న ఇద్దరు భార్యలు...

ఒక భర్తకు ఇద్దరు భార్యలుంటే... అతడు బ్రతికి వున్నప్పుడు అతడి కోసం కొట్టుకోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం అతడు చనిపోయిన తర్వాత ఆ ఇద్దరు భార్యలు శవం ముందు పిచ్చ కొట్టుడు కొట్టుకున్నారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని వ్యవసాయ యూనివర్శిటీలో 44 ఏళ్ల సెంథిల్ కుమార్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతడికి విజయ అనే యువతితో పెళ్లవగా వారికి ఓ అమ్మాయి కూడా పుట్టింది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. విజయకు సెంథిల్ విడాకులు కూడా ఇచ్చేశాడు. 
 
కొన్నాళ్లకు మహేశ్వరి అనే యువతిని మరో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి క్వార్టర్స్‌లోనే కాపురం పెట్టేశాడు. ఈ క్రమంలో విధుల నిర్వహిస్తున్న సమయంలో సెంథిల్ గుండెపోటుకు గురై కన్నుమూశాడు. దీనితో భర్త శవాన్ని మహేశ్వరి తన బంధువుల ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయాలనుకుంది. ఇంతలో విడాకులు తీసుకున్న విజయ కూడా వచ్చింది. తన భర్త శవాన్ని తనకిస్తే అంత్యక్రియలు చేస్తానంటూ కోరింది. ఐతే అందుకు మహేశ్వరి ససేమిరా అన్నది. దీనితో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. ఇద్దరూ జుట్లూ జుట్లూ పట్టుకుని భర్త శవాన్ని ముందు పెట్టుకుని పిచ్చ కొట్టుడు కొట్టుకున్నారు. 
 
ఇదంతా చూసిన బంధువులు వీరి కొట్లాట సర్దుమణిగేలా లేదని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి సర్దిచెప్పడానికి నానా తంటాలు పడ్డారు. చివరికి ఇద్దరూ కాకుండా పెద్ద భార్య కుమార్తెతో అంత్యక్రియలు పూర్తి చేయించారు.