1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (19:39 IST)

యూఐడీఏఐ కీలక నిర్ణయం.. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు..?

aadhar card
ఆధార్ కార్డులను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంది. మనిషి పుట్టిన తేదీ దగ్గర నుంచి చనిపోయే తేదీ వరకు వివరాలను సేకరించనుంది. తద్వారా ఆ వ్యక్తి జీవిత కాలం ఎంత అనేది స్పష్టంగా తెలిసిపోతుంది.
 
ఇందులో భాగంగా అప్పుడే పుట్టిన నవ జాత శిశువులకు తాత్కాలిక ఆధార్ కేటాయించబోతోంది. వారికి ఐదేళ్లు వచ్చాక శాశ్వత ఆధార్ నెంబర్, మేజర్లయిన తర్వాత బయోమెట్రిక్ సేకరణ వంటివి చేయనుంది. 
 
దీని కోసం రెండు నెలల పాటు పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తోంది. దీంతో పాటు వ్యక్తి మరణించిన వెంటనే అతని వివరాలు ఆధార్ పోర్టల్‌లో నమోదయ్యేలా తగిన చర్యలు తీసుకోనుంది. 
 
ఫలితంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగులైతే పింఛను ప్రయోజనాలు దుర్వినియోగం కాకుండా ఉంటాయనేది వారి ఆలోచన. కరోనా లాక్‌డౌన్‌, తర్వాత పరిస్థితుల్లో అనేక మంది చనిపోగా, ఆ వివరాలు పోర్టల్‌లో నమోదు కాలేదు. వారి బ్యాంక్ అకౌంట్లు, రావాల్సిన పింఛన్లు యథావిధిగా వచ్చాయి. 
 
అంతేకాక, చనిపోయిన వారి ఆధార్, బ్యాంకు అకౌంట్లు ఆక్టివ్‌గా ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.