1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (09:40 IST)

లాక్డౌన్ అన్‌లాక్ 5.O : కొత్త మార్గదర్శకాలు ఇవే...!

కరోనా వైరస్ నియంత్రణ కోసం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేశారు. ఆ తర్వాత దీన్ని దశల వారీగా సడలించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అన్‌లాక్ 4.0 ఈ నెల 30వతేదీతో ముగియనుంది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి అన్‌లాక్ 5.0 ప్రారంభంకానుంది. ఇందుకోసం కేంద్రం కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఇందులో గతంతో పోల్చితే అనేక సడలింపులు ఉంటాయని కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
దేశ వ్యాప్తంగా అక్టోబరు నుంచి పండగ సీజన్ మొదలుకానుంది. తొలుత దసరా, ఆ తర్వాత దీపావళి, అనంతరం క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి ఇలా వరుస పండగులు రానున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని నిబంధనలను సడలించడం ద్వారా, ప్రజల యాక్టివిటీని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం ఇవ్వవచ్చని ప్రభుత్వం భావిస్తూ, అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలను తయారు చేసింది. 
 
ముఖ్యంగా, అక్టోబరు నుంచి సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బార్లు, క్లబ్బులు తెరచుకున్నాయి. పరిమితంగానే అయినా, ప్రజల అవసరాలను తీర్చేలా బస్సులు కూడా నడుస్తున్నాయి. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు కూడా మొదలై పోయాయి. అక్టోబరు 1 నుంచి సినిమా హాల్స్ తెరచుకోవచ్చని ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతిచ్చింది.
 
రాస్తూ, నిబంధనలకు అనుగుణంగా సినిమా హాల్స్ తెరిచేందుకు అనుమతించాలని కేంద్ర సమాచార శాఖ కూడా కోరింది. లైన్ వదిలి లైన్‌లో సీట్లను ఖాళీగా ఉంచుతూ, 50 శాతం కన్నా తక్కువ ప్రేక్షకులతో సినిమాలను ప్రదర్శించుకునేందుకు అన్‌‌లాక్ 5.0లో అనుమతి లభించనుందని సమాచారం. 
 
ఇక కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన మరో రంగమైన టూరిజం సెక్టార్‌కు కూడా సడలింపులు భారీగానే లభించనున్నాయి. పర్యాటకులకు స్వాగతం పలికేలా అన్ని టూరిజం స్పాట్లూ తెరచుకోనున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్ టూరిస్టులను స్వాగతిస్తోంది. ఎలాంటి కరోనా రిపోర్టు, క్వారంటైన్ లేకుండానే తమ రాష్ట్రానికి పర్యాటకులు వచ్చిపోవచ్చని కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. 
 
అలాగే, అక్టోబరు నుంచి విద్యా సంస్థలకు కూడా మరిన్ని సడలింపులు ఉంటాయని, ఈ విషయంలో మాత్రం నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని కూడా కేంద్రం స్పష్టం చేస్తుందని సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 9 నుంచి 12 తరగతులకు క్లాసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రైమరీ స్కూళ్లు మాత్రం మరికొన్ని వారాల తర్వాతే తిరిగి తెరిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.