1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (09:08 IST)

జీన్స్ ఫ్యాంట్ వేసుకుందనీ అమ్మాయిని కొట్టి చంపిన రాక్షసులు

ఇటీవలి కాలంలో మహిళలపై జరుగుతున్న నేరాలు ఘోరాల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటనలు అధికంగా జరుగుతున్నాయి. తాజాగా ఓ యువతి జీన్స్ ఫ్యాంట్ వేసుకున్నందుకు కొట్టి చంపేశారు. ఈ దారుణం దియోరియో జిల్లాలో జరిగింది. ఆ యువతిని చంపేసి మృతదేహాన్ని ఓ వంతెన రెయిలింగ్‌కు వేలాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపించడం కలకలం రేపింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉపాధి కోసం పంజాబ్‌కు వలస వెళ్లిన ఆ యువతి కుటుంబం మళ్లీ కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి స్వగ్రామానికి వచ్చింది. కాగా, ఆ అమ్మాయి జీవనశైలిపై బంధువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసేవారు. 
 
ఓ రోజు ఆమె ఉపవాసం చేసి, ఆ సాయంత్రం జీన్స్ ప్యాంట్, టాప్ ధరించి గుడికి వెళ్లేందుకు సిద్ధం కావడంతో తండ్రి ఆమెను వారించాడు. ఆ వేషధారణ సరికాదని అన్నాడు. అయినప్పటికీ ఆ అమ్మాయి తన వేషధారణ మార్చుకోకపోవడంతో అక్కడే ఉన్న ఇతర బంధువులు ఆమెపై కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు.
 
స్పృహ కోల్పోయిన ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళుతున్నామని చెప్పి, చనిపోయిన ఆ యువతిని బ్రిడ్జి రెయిలింగ్‌కు వేలాడదీశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.