1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 మే 2021 (09:56 IST)

మోడీజీ.. ఇకపై మేం ప్రాణ వాయువు ఇవ్వలేం : కేరళ సీఎం

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. దీంతో ముందుగానే అప్రమత్తమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ లాక్డౌన్ విధించారు. ఇది ఫలించడంతో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. అదేసమయంలో రాష్ట్రంలో ఉన్న ఆక్సిజన్ నిల్వలు నిండుకుంటున్నాయి. దీంతో కేరళ సీఎం విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
అందువల్ల కేరళ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ను సరఫరా చేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కేంద్రానికి తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి సోమవారం లేఖ రాశారు. ఇప్పటికే తమ వద్ద ఉన్న అత్యవసర ఆక్సిజన్‌ నిల్వలు సైతం పూర్తి కావస్తున్నాయని తెలిపారు. కేవలం 86 మెట్రిక్‌ టన్నుల అత్యవసర నిల్వలు మాత్రమే ఉన్నట్లు అందులో వివరించారు. 
 
మే 6న కేంద్ర కమిటీ నిర్ణయించినట్లుగా తమిళనాడుకు 40 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేస్తామన్నారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదని తెలిపారు. ప్రస్తుతం కేరళలో 4,02,640 క్రియాశీలక కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. మే 15 నాటికి ఈ సంఖ్య ఆరు లక్షలకు చేరే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మే 15 నాటికి తమకు 450 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
 
రాష్ట్రంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లలో ఐనాక్స్ ప్రధానమైందని విజయన్‌ తెలిపారు. దీని తయారీ సామర్థ్యం 150 మెట్రిక్‌ టన్నులని పేర్కొన్నారు. మొత్తం ఇతర చిన్న ప్లాంట్లతో కలిపి రాష్ట్రంలో రోజుకి 219 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అందుబాటులో ఉంటుందని వివరించారు. 
 
ఇక ప్రధాన స్టీల్‌ ప్లాంట్లన్నీ కేరళకు భౌగోళికంగా దూరంగా ఉన్న నేపథ్యంలో కేరళలో ఉత్పత్తవుతున్న మొత్తం ఆక్సిజన్‌ తమ రాష్ట్రానికే కేటాయించాలని కోరారు. కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో ప్రస్తుతం కేరళలో లాక్డౌన్‌ కొనసాగుతోంది.