గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 20 జులై 2020 (09:29 IST)

సోనూసూద్ పేరుతో వెల్డింగ్ షాపు.. కృతజ్ఞత తెలిపిన పేద కార్మికుడు

ఎవరు అవునన్నా కాదన్నా రియల్ హీరో, విలక్షణ నటుడు సోనూసూద్ పెద్ద మనసు కరోనా కాలంలో ఎంతోమంది వలస కార్మికులను కాపాడింది.

మరెంతో మందికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. అలా ఆయన చేత సాయం పొందిన ఓ వలస కార్మికుడు తన విశ్వాసాన్ని, కృతజ్ఞతను చాటుతూ తను పెట్టుకున్న వెల్డింగ్ షాపుకు సోనూసూద్ పేరు పెట్టాడు. వివరాల్లోకి వెళితే..

కరోనా వల్ల దేశవ్యాప్తంగా వలస కార్మికులు నరకయాతన అనుభవించారు. ఇటువంటి సమయంలో వారి పరిస్థితులను గమనించిన సినీనటుడు సోనూసూద్‌ సొంత ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేసి తమ స్వస్థలాలకు పంపారు. కేరళలో చిక్కుకుపోయిన ఒడిశాకు చెందిన 169 మంది వలస కార్మికులను ప్రత్యేక విమానంలో స్వస్థలాలకు పంపించారు.

ఇలా వెళ్లిన వారిలో ఓ వలస కార్మికుడు సోనూసూద్‌ చేసిన సాయానికి గుర్తుగా ఓ పని చేసి ఆయనపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నాడు.

కేంద్రపర జిల్లాలోని చించిరి గ్రామానికి చెందిన ప్రశాంత్‌ కుమార్‌ ప్రధాన్‌ 32 ఏళ్ల వ్యక్తి కొచ్చిలో ప్లంబర్‌గా పనిచేసేవాడు. స్వస్థలానికి చేరుకున్నాక ఉద్యోగం కోసం పలుచోట్ల ప్రయత్నించినా ఎక్కడా పని దొరకకపోవడంతో సొంతంగా ఓ షాప్‌ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు.

భవనేశ్వర్‌కు 140 కిమీ దూరంలో ఉన్న హతినాలో సొంతంగా వెల్డింగ్‌ షాప్‌ పెట్టుకున్నాడు. ఈ షాపునకు సోనూసూద్‌ పేరు పెట్టి ఆయనపై తన కృతజ్ఞతను చాటుకున్నాడు.