మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 జులై 2018 (18:47 IST)

ఏం మొగుడురా బాబూ : కట్నం కింద భార్య కిడ్నీ అమ్మేశాడు...

వివాహ సమయంలో అడిగినంత కట్నం ఇవ్వక పోతే.. పెళ్లి పీటలపై పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒకవేళ ముహుర్త సమయానికి పెళ్లిళ్లు జరిగినప్పటికీ ఆ తర్వాత వరకట్న వేధింపులనేవి ఉంటాయి.

వివాహ సమయంలో అడిగినంత కట్నం ఇవ్వక పోతే.. పెళ్లి పీటలపై పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒకవేళ ముహుర్త సమయానికి పెళ్లిళ్లు జరిగినప్పటికీ ఆ తర్వాత వరకట్న వేధింపులనేవి ఉంటాయి. అయితే, ఈ భర్త మాత్రం మిగిలినవారికి భిన్నం. కట్నం కింద ఏకంగా భార్య కిడ్నీనే అమ్మేశాడు. అదికూడా 12 ఏళ్ల తర్వాత. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది.
 
కోల్‌క‌తాకు చెందిన బిస్వజిత్‌ అనే వ్యక్తికి.. రీటా అనే యువతితో 12 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. కట్నంగా ఇస్తామన్న 2 లక్షల రూపాయలను అత్తింటివారు ఇవ్వలేదు. ఈ కట్నం కోసం భార్యను పుష్కరకాలంగా వేధిస్తూనే వచ్చాడు. అయినా రీటా తల్లిదండ్రులు డబ్బు సర్దుబాటు చేయలేకపోయారు. దీంతో ఇక తనకు కట్నం ఇవ్వరని డిసైడ్ అయిన శాడిస్ట్ భర్త... ఓ ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్‌లో భాగంగా తన భార్య కిడ్నీని అమ్మేశాడు. 
 
ఇది రెండేళ్ళ క్రితం జరిగింది. ఆ సమయంలో రీటాకు కడుపునొప్పి రావడంతో భర్త బిస్వజిత్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పట్లో తీవ్ర కడుపునొప్పి అని.. అపెండిక్స్ ఆపరేషన్ చేశారని చెప్పాడు. అప్పట్లో నిజమే అని అందరూ అనుకున్నారు.
 
ఇటీవల రీటాకి మళ్లీ తీవ్ర నొప్పి వచ్చింది. బంధువులు ఉత్తర బెంగాల్ మెడికల్ కళాశాల, ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు... కుడి వైపు కిడ్నీ లేదని చెప్పి షాకిచ్చారు. ఆ తర్వాత తన భర్తను నిలదీసింది. అప్పుడు అసలు విషయం చెప్పాడు. రెండేళ్ల క్రితం అపెండిక్స్ ఆపరేషన్ అని చెప్పింది అబద్ధమనీ, అపుడు కిడ్నీ తీసుకుని అమ్మేసుకున్నాని అని చెప్పాడు. కట్నం కింద జమ చేసుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. 
 
దీంతో చిర్రెత్తుకొచ్చిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త బిస్వజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. సర్జరీ చేసిన ఆస్పత్రిపై దాడులు చేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు కిడ్నీ అమ్మేసినట్టు బిస్వజిత్‌ నేరాన్నిఅంగీకరించాడు.