1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (11:18 IST)

టెంపుల్స్ ఓపెనింగ్‌కు అన్నా హజారే డెడ్‌లైన్!

మహారాష్ట్రలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి అల్లకల్లోలం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ఆలయాలు, వినోద కేంద్రాలను మూసివేసివున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా మూసివేసిన ఆలయాలన్నింటినీ 10 రోజుల్లోగా తెరవాలని అన్నా హజారే డిమాండ్‌ చేశారు. లేకపోతే జైల్‌ భరో చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 
 
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా, ప్రభుత్వం అనేక రకాలైన కఠిన ఆంక్షలను అమలు చేస్తూ వస్తోంది. ఇందులోభాగంగా, గత ఏడాదిన్నర నుంచి ప్రార్థనా స్థలాలన్నీ మూసే ఉంటున్నాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్‌ నియమాలను దశలవారీగా సడలిస్తున్నారు. 
 
దీంతో బార్లు, వైన్‌ షాపులు, హోటళ్లు, వివిధ వ్యాపార రంగ సంస్థలు అన్నీ పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. లాక్‌డౌన్‌ నియమాలకు కట్టుబడి జనాలు కూడా నిర్భయంగా ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. దీంతో ఆలయాలను కూడా తెరవాలని గత కొద్ది నెలలుగా ప్రజల నుంచి డిమాండ్‌ వస్తోంది.
 
వివిధ వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, హోటళ్లు సహా వైన్‌ షాపులు కూడా తెరిచే ఉంటున్నాయని, ఆలయాలను తెరవడంలో ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని అన్నా హజారే నిలదీశారు. 10 రోజుల్లో ఆలయాలను తెరవని పక్షంలో మందిర్‌ బచావ్‌ కృతి సమితి జైల్‌ భరో నిర్వహిస్తుందని, అందుకు తన మద్దతు ఉంటుందని ఆయన స్పష్టంచేశారు.