శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2020 (19:44 IST)

ప్రాణస్నేహితుడితో భార్య, కిరోసిన్ పోసి నిప్పంటించినా కదల్లేదు కాలిపోయాడు...

అక్రమ సంబంధాలు ఎన్నో జీవితాలను ఛిద్రం చేసేస్తున్నాయి. ప్రాణానికి ప్రాణంగా కలిసి ఉండే స్నేహితులను విడదీస్తున్నాయి. పచ్చటి సంసారాన్ని నిలువునా కూలుస్తున్నాయి. ఆత్మహత్యలకు, హత్యలకు కారణమవుతున్నాయి. సమాజంలో ఇన్ని జరుగుతున్నా కొందరిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
 
అలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. తిరుపత్తూరు జిల్లాలోని అంబూరు సమీపంలోని దేవలాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రామాపురంలో మణికందన్, అభిరామిలు దంపతులు. మణికందన్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు.
 
మణికందన్‌కు చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు రాజేష్. అతడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరూ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. అందులోనూ ప్రాణస్నేహితులు. మణికందన్ భార్య అభిరామి, రాజేష్‌లు ఒకే కంపెనీలో పనిచేస్తుండేవారు.
 
స్థానికంగా ఉన్న షూ కంపెనీలో ఇద్దరూ విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో అభిరామిని మోటారు సైకిల్ పైన తీసుకెళ్ళేవాడు రాజేష్. ప్రాణస్నేహితుడు కావడంతో మణికందన్ అభిరామిని రాజేష్ బండిపై పంపించేవాడు.
 
అలా ఇద్దరి మధ్య పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది ఇలా కొన్నిరోజుల పాటు సాగుతుంటే రెండురోజుల క్రితం భర్తకు బంధువుల ద్వారా విషయం తెలిసింది. భార్యను సున్నితంగా మందలించాడు. తనకేం పాపం తెలియదని అభిరామి చెప్పే ప్రయత్నం చేసింది. అయితే నిన్న మధ్యాహ్నం షూ కంపెనీ నుంచి రాజేష్, అభిరామిలు వచ్చేశారు. అభిరామి ఇంట్లోనే ఇద్దరూ సరససల్లాపాల్లో మునిగితేలుతున్నారు. అదే సమయానికి భర్త రావడం, ఈ దృశ్యాలను కళ్ళారా చూశాడు.
 
ఆగ్రహంతో ఊగిపోయాడు. ప్రాణ స్నేహితుడు ఇలాంటి పని చేసినందుకు తన ఇంట్లోని కిరోసిన్ డబ్బాను తీసుకుని అందులో ఉన్న కిరోసిన్‌ను రాజేష్ ఒంటిపై పోసాడు. స్నేహితుడు అలా కిరోసిన్ పోస్తున్నా రాజేష్ ఒక్క అడుగు కూడా వేయలేదు. అలాగే నిలబడిపోయాడు. దీనితో మణికందన్ అగ్గిపుల్ల గీసి అతడికి అంటించి నిలువునా తగులబెట్టాడు.
 
అభిరామి అక్కడి నుంచి పారిపోయింది. రాజేష్ శరీరం పూర్తిగా కాలిపోగా ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపే చనిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తను జైలు నుంచి బయటకు రాగానే తన భార్యను కూడా చంపేస్తానని ఆవేశంగా వెళ్ళాడట మణికందన్.