శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 అక్టోబరు 2020 (19:40 IST)

ఎన్నికల హామీగా కరోనా : తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటన

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఈ వైరస్ బారి నుంచి తమ ప్రజలను రక్షించుకునేందుకు పలు దేశాలు విస్తృతంగా టీకాల తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ వ్యాక్సిన్ల తయారీలో వివిధ దశల పరీక్షల్లో ఉన్నాయి. 
 
ఈ వ్యాక్సిన్లు ఈ యేడాది డిసెంబరు నాటికి కానీ, లేదంటే వచ్చే ఏడాది తొలి అర్థభాగంలో కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజానికి వ్యాక్సిన్ ప్రస్తుతం పరీక్షల దశలోనే ఉన్నప్పటికీ ఇప్పుడిది ఎన్నికల హామీగా మారింది.
 
రాజకీయ నేతలు ఇప్పుడు ఈ టీకా గురించి ప్రజలకు ఎడాపెడా హామీలు గుప్పిస్తున్నారు. ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ తొలిసారిగా ఈ అంశాన్ని తలకెత్తుకుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను తాజాగా ప్రకటించింది. ఇందులో తమ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించింది. 
 
బీజేపీ అలా ప్రకటించిందో.. లేదో.. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి కూడా ఇదే పల్లవి ఎత్తుకున్నారు. కరోనా టీకా అందుబాటులోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వేస్తామని హామీ ఇచ్చారు.
 
ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న టీకాలు మరికొన్ని నెలల్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, ఒకసారి టీకా అందుబాటులోకి రాగానే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పళనిస్వామి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.