1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 2 జనవరి 2023 (11:14 IST)

ఢిల్లీలో దారుణం.. మద్యంమత్తులో యువతిని కారుతో ఢీకొట్టిన యువకులు

road accident
ఢిల్లీలో దారుణం జరిగింది. మద్యంమత్తులో కొందరు యువకులు కారుతో స్కూటీపై వెళుతున్న యువతిని ఢీకొట్టారు. ఆ తర్వాత ఆమెను నాలుగు కిలోమీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. దీంతో తీవ్రంగా గాయాపడిన ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
పోలీసుల కథనం మేరకు ఆదివారం తెల్లవారుజామున ఓ యువతి తన స్కూటర్‌పై వెళుతోంది. ఆమె స్కూటర్‌ను ఓ కారు ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆమె దుస్తులు కారు టైరులో చిక్కుకున్నాయి. స్కూటర్‌ను ఢీకొట్టినప్పటికీ కారును మాత్రం ఆపలేదు. అలా ఏకంగా నాలుగు కిలోమీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. శరీరంపై నూలుపోగు లేకుండా రోడ్డుపై పడివున్న ఆ యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
రోడ్డుపై నగ్నంగా పడివున్న యువతిని చూసి ఎవరో అత్యాచారం చేసి శవాన్ని రోడ్డుపై పడేసివుంటారని అందరూ భావించారు. కానీ, రోడ్డు ప్రమాదం కారణంగా ఆమెను కారు ఈడ్చుకెళ్లడం ద్వారా మరణించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆదివారం తెల్లవారుజామున 3.24 గంటలకు రోడ్డుపై మృతదేహం ఉన్నట్టు తమకు సమాచారం అందిందని, వెంటనే అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించినట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. కేసు నమోదు చేసి ఈ దారుణానికి పాల్పడిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. 
 
మరోవైపు, యువతిని ఈడ్చుకెళ్లి మృతి చెందేందుకు కారణమైన ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులో నిజా నిజాలు తేల్చి పూర్తి వివరాలను సమర్పించాలని పోలీసులకు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ నోటీసులు ఇచ్చారు.