1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (18:55 IST)

యూపీలో మూడు నెలలకు మూడు ముళ్లు వేయకూడదట.. ఎందుకు?

ఉత్తరప్రదేశ్‌లోని ఓ జిల్లాలో మూడు నెలలకు ఎవ్వరూ పెళ్లి మాట ఎత్తకూడదట. అవును. యూపీలోని అలహాబాద్ జిల్లాలో ఇక మూడు నెలలకు ఎవ్వరూ వివాహం చేసుకోకూడదని ఆ రాష్ట్ర సర్కారు షరతు విధించిందట. ఈ నిషేధంపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.


అంతేగాకుండా.. మరో మూడు నెలలకు ముందుగానే బుక్ చేసిన కళ్యాణ మండపాల ఈవెంట్లను రద్దు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో చేసేది లేక ముహూర్తాలను మూడు నెలలకు తర్వాత వాయిదా వేసుకున్న వారు కూడా వున్నారట. 
 
అయితే ఇందుకు కారణం లేకపోలేదు. యూపీలోని అలహాబాద్‌లో వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మొత్తం మూడు నెలల పాటు కుంభమేళా జరుగనుంది. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు భారీ ఎత్తున ప్రజలు యూపీకి తరలిరానున్నారు. కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానమాచరించే వారి సంఖ్య వచ్చే ఏడాది భారీగా వుంటుందని యోగి ఆదిత్యనాథ్ సర్కారు భావిస్తోంది. 
 
ముఖ్యంగా ముహూర్తపు రోజుల్లో ఈ రద్దీ సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశం వుంది. ఇందుకోసం కళ్యాణ మండపాలను భక్తులకు ఆశ్రయం కల్పించనున్నారు. ఆహారం, నివాసం కోసం కళ్యాణ మండపాల్లో ఏర్పాట్లు చేసేందుకు యోగి సర్కార్ సంసిద్ధమైంది. అలాంటి సమయంలో వివాహం జరిపితే.. కుంభమేళాలో పాల్గొనే భక్తులకు ఇక్కట్లు తప్పవని యూపీ సర్కార్ తెలిపింది.
 
అందుచేత జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల పాటు అలహాబాద్‌లో వివాహాలను జరపకూడదని యోగి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు.. జిల్లా అధికారులు  కళ్యాణ మండపాలు, హోటల్‌ నిర్వాహకులకు నోటీసులు పంపారు.