1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Medaram Sammakka Sarakka Jatara 2022

మేడారం జాతరను ఎలా నిర్వహించాలి.. తెలంగాణ అధికారుల సమాలోచనలు

Medaram Sammakka Sarakka Jatara 2022
భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరకు గుర్తింపు వుంది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ యేడాది ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ జాతరను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అయితే, కరోనా వ్యాప్తి అధికంగా ఉన్ననేపథ్యంలో కోవిడ్ ఆంక్షల మధ్యే ఈ యేడాది కూడా ఈ జాతరను జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ప్రతి రెండేళ్ళకు ఒకసారి ఈ జాతరను నిర్వహిస్తారు. ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు జరుగుతుంది. కుంభమేళ తర్వాత భారీగా భక్తులు పాల్గొనే ఈ జాతరను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. 
 
ఈ జాతరను చూసేందుకు ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి గిరిజన ప్రజలు తరలివస్తారు. భక్తి పారవశ్యంతో, పూనకాలతో ఊగిపోతూ లక్షలాది మంది భక్తులు సమ్మక్క - సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతర భక్త జన సంద్రాన్ని తలపిస్తుంది. 
 
అయితే, తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికండా ఉండటంతో ఈ జాతర నిర్వహణపై అధికారులు తర్జనభర్జన చెందుతున్నారు. కోటి మందికి పైగా వచ్చే భక్తులను ఏ విధంగా కట్టడి చేయాలన్న అంశంపై వారు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ జాతరకు వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా 24 గంటల లోపు కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ చూపించేలా ఆంక్షలు విధించాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. 
తర్వాతి కథనం
వెన్న, ద్రాక్ష పండ్లతో హనుమంతుడిని పూజిస్తే...?