శుక్రవారం, 18 అక్టోబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2024 (20:45 IST)

అక్టోబర్‌ 17న పౌర్ణమి గరుడ సేవ.. భారీ వర్షాలు.. నడక మార్గం మూత

garuda seva in tirumala
అక్టోబర్‌ 17న పౌర్ణమి సందర్భంగా నెలవారీ గరుడసేవ జరగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్నారు. గురువారం పున్నమిని పురస్కరించుకుని రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక, దసరా పండగ సెలవులు ముగిసినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 
 
మరోవైపు గురువారం సాయంత్రం వరకు వచ్చే 36 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు యాత్రికుల భద్రత కోసం నివారణ చర్యలు చేపట్టడంలో సంబంధిత అధికారులందరూ మరింత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.
 
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమలలోని గోగర్భం సర్కిల్ నుంచి పాపవినాశనం మార్గంలో భక్తుల ప్రవేశాన్ని టీటీడీ ఇప్పటికే మూసివేసింది. అక్టోబరు 17న శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాన్ని పూర్తిగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. తుపాను వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ నడకదారి పనితీరుపై నిర్ణయం తీసుకోనున్నారు.