మహారాష్ట్రలోని పంఢర్పూర్ను దక్షిణ కాశీగా హిందువులు పేర్కొంటారు. ఆ రాష్ట్ర వాసులు తమ కులదైవంగా శ్రీ విఠలా-రుణ్మికీ అమ్మవారిని కొలుస్తారు. భక్తి ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించిన సంత్ తుకారం, సంత్ నామదేవుడు, సంత్ పురంధర్ దాసు, ఛిక్లా మేలా, జానాబాయిలు విఠలుడిని కొలిచారు.
మహారాష్ట్రలో చంద్రభాగ నదిగా పిలిచే భీమరథి నది ఒడ్డున ఉంది పంఢర్పూర్. వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తలు లక్షలాది సంఖ్యలో విఠలుడి దర్శనార్ధం ప్రతి ఏడాది వస్తారు. పంఢరిపురానికి మరో పేరు పుండలిక. విఠలుని దేవాలయం అతిపెద్దది. దేవాలయానికి ఆరు ద్వారాలు ఉన్నాయి. తూర్పున ఉన్న ద్వారాన్ని నామదేవ్ ద్వారంగా పిలుస్తారు.
పంఢరినాథుడి దేవాలయం 5వ శతాబ్దానికి ముందుందని అంటారు. రాష్ట్రకూటులకు చెందిన రాగి ఫలకాలపై ఈ దేవాలయానికి సంబంధించిన సమాచారం ఉంది. స్థానిక దేవాలయంలో పదస్పర్శ దర్శనంను ప్రత్యేక ఉత్సవంలా జరుపుతారు. ఈ సమయంలో అధిక సంఖ్యలో భక్తులు దేవాలయానికి వస్తారు. ఆషాడ, కార్తీక ఏకాదశి రోజుల్లో విఠలా-రుక్మిణిలను పల్లకీలో ఉంచి ఊరేగింపు జరుపుతారు. వీటితో పాటుగా రోజూ అనేక కార్యక్రమాలు జరుపుతారు.
శ్రీవిఠలుని దేవాలయం ప్రాంగణంలోనే దాదాపు 25 మందిరాలు ఉన్నాయి. ఇందులో గణేష, గరుడ, ఏకముఖ దత్తాత్రేయ, సత్యభామ, కన్హోపాత్ర వంటివి ఉన్నాయి.
వసతి దేవాలయానికి చెందిన ధర్మసత్రాలతో పాటుగా అనేక హోటెళ్లు ఇక్కడ ఉన్నాయి.
ఎలా చేరుకోవాలి విమాన మార్గం : పూణె (218 కిమీ.) రైలు మార్గం : సమీపంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ షోలాపూర్ (65 కి.మీ.). మీరజ్-కురుద్వాడి మీటర్ గేజి మార్గంలో పంఢర్పూర్ రైల్వే స్టేషన్ ఉంది. కురుద్వాడి-పంఢర్పూర్ మార్గం ప్రస్తుతం బ్రాడ్గేజిగా మార్చారు. దీనితో షోలాపూర్-పంఢర్పూర్ మార్గంలో రైళ్ల రాకపోకలు నడుస్తున్నాయి. రహదారి మార్గం : మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల నుంచి పంఢర్పూర్కు బస్సు సేవలు ఉన్నాయి.