శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. శ్రీరామనవమి
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 1 ఏప్రియల్ 2020 (22:23 IST)

శ్రీరామ నవమి: రామ నామ స్మరణ చేసిన పరమేశ్వరుడు, ఏంటా మంత్రం?

పరమేశ్వరుడు, ముక్కంటి అయిన శివుడే విష్ణు స్తోత్రమునకు శ్రీరామ మంత్రాన్ని జపించినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. దుష్టశిక్షణ శిష్టరక్షణార్ధమై చైత్రశుద్ద దశమినాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం 'శ్రీరామనవమి' గా విశేషంగా జరుపుకుంటాం.
 
'రామ' యనగా రమించుట అని అర్ధం. కావున మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న 'ఆ శ్రీరాముని' కనుగొంటూ వుండాలని పండితులు అంటున్నారు.
 
ఒకసారి పార్వతీదేవి పరమశివుని 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, "ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!" అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు.
 
శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
 
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వార్కి సధ్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.
 
శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు 'రా' అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయని విశ్వాసం. అలాగనే 'మ' అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందుచేత శ్రీరామనవమి నాడు శ్రీరాముని అనుగ్రహం పొందాలంటే ఈ ఒక్క మంత్రముతో జపిస్తే చాలునని పండితులు అంటున్నారు.