1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2024 (12:48 IST)

మృగశిర కార్తె ప్రారంభం... నాంపల్లిలో చేప మందు పంపిణీ!!

fish prasadam
మృగశిర కార్తె శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. దీంతో హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఉబ్బసం రోగగ్రస్తులకు బత్తిన సోదరులు చేప మందును పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. శని, ఆదివారాల్లో సాగే ఈ చేప మందు పంపిణీలో అనేక వేల మంది వచ్చి చేప మందును స్వీకరించనున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యశాఖ అవసరమైన చేప పిల్లలు సమకూరుస్తుండగా, దూర ప్రాంతం నుంచి వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ కూడా అదనంగా 130 ఆర్టీసీ బస్సులను నడిపేలా చర్యలు చేపట్టింది. చేప ప్రసాదం కోసం నగరానికి వచ్చే వారు ఇబ్బందులు పడకుండా వివిధ ప్రాంతాల నుంచి నేరుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు బస్సులు నడుపుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఈసీఐఎల్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, దిల్‌సుఖ్ నగర్, ఎన్జీవోస్ కాలనీ, మిథాని, ఉప్పల్, చార్మినార్, గోల్కొండ, రాంనగర్, రాజేంద్ర నగర్, రిసాల బజార్, పటాన్ చెరు జీడిమెట్ల, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేశారు.