కూల్చివేతలు.. పేల్చివేతలు... ఎగవేతల్లో రేవంత్ సర్కారు బిజీ : కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతల్లో బిజీగా ఉందని ఆరోపించారు.
హైదరాబాద్, శేరిలింగంపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు నేడు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మేడిగడ్డను కూల్చివేసిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు చెక్డ్యామ్లను పేల్చివేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు మాత్రమేనని వ్యాఖ్యానించారు.
'ఎన్నో హామీలిచ్చిన రేవంత్రెడ్డి అన్నీ ఎగవేశారు. ఆయన కిస్మత్ బాగుండి పేమెంట్ కోటాలో సీఎం అయ్యారు. హామీల గురించి ప్రశ్నిస్తే రేవంత్ బూతులు తిడుతున్నారు. తిట్ల భాష మాకూ వచ్చు.. కానీ మేం తిట్టం. పెంచుతామన్న పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారో సీఎం చెప్పాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను వరుసగా రెండుసార్లు గెలిపించారు. హైదరాబాద్ ప్రజలకు నేను పాదాభివందనం చేసినా తక్కువే. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ తట్టుకోలేరు' అని కేటీఆర్ అన్నారు.